రిజిస్ట్రేషన్‌లో రికార్డుల మోత

10 Oct, 2019 13:38 IST|Sakshi

ఈ ఏడాది రూ.250 కోట్లు దాటనున్న ఆదాయం

గతంలో ఎప్పుడూ ఇంత మొత్తం రానివైనం

ఈ ఏడాది 15 శాతం పెరుగుదల

జగన్‌ సర్కార్‌ భరోసాతో పెరిగిన రిజిస్ట్రేషన్లు

జిల్లాలో కొత్త పరిశ్రమలు,ఇరిగేషన్‌ ప్రాజెక్టులు

అభివృద్ధి్ద వికేంద్రీకరణకు చర్యలు

నియోజకవర్గాలలో ప్రగతి ప్రణాళికలు

అమాంతంగా పెరిగిన భూమి ధరలు

జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖలో రికార్డుల మోత మోగుతోంది. గతంలో ఎన్నడూలేనంతగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.  ప్రభుత్వ ఆదాయంమరింతగా పెరుగుతోంది. జనవరి నుండి మే వరకూ ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.80 కోట్ల నుండి రూ.90 కోట్ల మధ్య మాత్రమే ఉండగా కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నాలుగు నెలల్లో  ఆదాయం రూ. 187కోట్లకు చేరింది. 2019 సంవత్సరానికి  ప్రభుత్వం టార్గెట్‌ రూ.
136.66 కోట్లు కాగా  గతనెలనాటికే రూ. 187 కోట్లకు రాబడి చేరుకుంది. ఇది డిసెంబర్‌ నాటికి రూ. 250 కోట్లకు చేరనుంది.

సాక్షి ప్రతినిధి కడప : తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో జిల్లాలో రిజిస్ట్రేషన్లు తక్కువగా జరగడంతో ప్రభుత్వ ఆదాయం అంతంతమాత్రంగానే ఉండేది.  దీనికి కారణం అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోవడం, కొత్త పరిశ్రమలు నెలకొల్పకపోవడం. ఫలితంగా భూములు, స్థలాల ధరలు పతనమయ్యాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రిజిస్ట్రేషన్లు దాదాపుగా పడిపోయాయి. 2016లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ రూ. 171.31 కోట్లు కాగా.. 61,608 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు  జరగ్గా రూ.115.44 కోట్ల ఆదాయం లభించింది. 2017లో రూ.140.43 కోట్ల టార్గెట్‌ . 62,577 రిజిస్ట్రేషన్లకు గాను రూ.138. 43 కోట్లు రాబడి వచ్చింది. గతేడాది రూ. 203.24 కోట్లు టార్గెట్‌. 83,838 రిజిస్ట్రే్టషన్లు జరిగాయి. రూ. 217 కోట్లు  ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ. 136.66 కోట్లు టార్గెట్‌ కాగా గత నెల చివరి నాటికి  72,866 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.187.51 కోట్ల ఆదాయం వచ్చింది.  అంటే నెలకు సగటున రూ.20.83 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్‌ నాటికి మరో రూ.62.49 కోట్లు రానుందని అధికారుల అంచనా. ఆ లెక్క ప్రకారం ఈ ఏడాది రాబడి రూ. 250 కోట్లకు చేరనుంది.  ఈ ఏడాది ఆగస్టులో అర్బన్,రూరల్‌ పరిధిలోనూ 10 శాతం రిజిస్ట్రేషన్‌ ధరలు  పెరిగాయి. జగన్‌ ప్రభుత్వం కొలువు దీరిన నాలుగు నెలల కాలంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ల గణాంకాల ప్రకారమైతే  రాబడి మరింత పెరిగే అవకాశం  కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 15 శాతం ఆదాయం పెరిగినట్లు గణాంకాలు  చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కడప పరిధిలోని చిట్వేలు,లక్కిరెడ్డిపల్లి,పుల్లంపేట,రాయచోటి,రాజంపేట,సిద్దవటం,సుండుపల్లి,కడప రూరల్,కడప అర్బన్‌ తో పాటు ప్రొద్దుటూరు పరిధిలోని బద్వేలు,జమ్మలమడుగు,ప్రొద్దుటూరు,కమలాపురం,మైదుకూరు,ముద్దనూరు,పులివెందుల,వేపంపల్లి,దువ్వూరు అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది.

ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు
జగన్‌ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పాలన వల్లే ఇది సాద్యమైందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడం, జిల్లాలో పలు కొత్త పరిశ్రలు,ప్రాజెక్టులతో పాటు అన్నిరంగాలలో  జిల్లాను సమగ్రాభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలకు దిగింది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే  ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో జిల్లా రాబోయే ఐదేళ్లలో  మరింత అభివృద్ధి చెందనుంది.  జిల్లాలో స్థలాలు, భూముల ధరలు మరింతగా పెరిగాయి. గత ప్రభుత్వంలో   పతనావస్థకు చేరిన  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మళ్లీ పుంజుకుంది. గత ఐదేళ్లలోపడిపోయిన రిజిస్ట్రేషన్లు తాజాగా జోరందుకున్నాయి. తద్వారా ప్రభుత్వానికి రాబడి పెరిగింది.

మరిన్ని వార్తలు