రికార్డు స్థాయిలో పింఛన్లు

2 Apr, 2020 03:16 IST|Sakshi
బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వృద్ధురాలికి పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌

లబ్ధిదారులు 53,97,303

కోట్ల రూపాయలు 1,278

విపత్కర పరిస్థితుల్లోనూ అదే స్ఫూర్తి, వేగం

లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందచేసిన వలంటీర్లు

అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు

పోర్టబులిటీ ద్వారా 28,230 మందికి లబ్ధి

వృద్ధులు, వితంతువులు,దివ్యాంగుల చేతికి రూ.1278.90 కోట్లు అందచేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: విపత్కర పరిస్థితుల్లోనూ అదే స్ఫూర్తి.. అదే వేగం. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, వ్యాధులతో సతమతమయ్యేవారికి ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ అందించాలన్న ముఖ్యమంత్రి జగన్‌ దృఢ సంకల్పం ముందు ఆటంకాలన్నీ తలవంచాయి. బుధవారం కూడా పింఛన్ల పంపిణీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా ముగిసింది. కరోనా భయాలు, లాక్‌డౌన్‌ ఇబ్బందులు మధ్య కూడా వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని సునాయాసంగా పూర్తి చేసింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ఒక్క రోజులోనే 92.35 శాతం మందికి పింఛన్లు నేరుగా అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53,97,303 మంది లబ్ధిదారుల చేతికి ప్రభుత్వం బుధవారం రూ.1278.90 కోట్లు అందచేసింది. ఈసారి పింఛన్ల పంపిణీలో అనుసరించిన పోర్టబులిటీ విధానం ద్వారా లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో ఉన్న 28,230 మందికి కూడా ప్రభుత్వం డబ్బులు అందచేసింది.

– విపత్తులోనూ సడలని వేగం, అంకిత భావంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,25,463 మంది వలంటీర్లు ఉదయమే పెన్షన్ల డోర్‌ డెలివరీ చేపట్టారు. 
– వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, వ్యాధులతో సతమతమయ్యేవారికి ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ అందించాలన్న ముఖ్యమంత్రి జగన్‌ దఢ సంకల్పం ముందు అటంకాలన్నీ తలవంచాయి. 
కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా వలంటీర్లు ఒకపక్క జాగ్రత్తలు తీసుకుంటూనే పెన్షన్లు పంపిణీ సజావుగా పూర్తి చేశారు. బయో మెట్రిక్‌ లేకుండా  ఫొటో గుర్తింపు ఆధారంగా పంపిణీ నిర్వహించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున లబ్ధి్దదారుల నుంచి సంతకాలు, వేలిముద్రలు సేకరించలేదు.
– లబ్ధిదారుల చేతికే పెన్షన్లకు అందిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వలంటీర్లు ముందుకు సాగారు.  
–ఉదయం 9 గంటలకే 65 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి కాగా పది గంటల కల్లా 77 శాతం మందికి అందచేశారు. మధ్యాహ్నం12 గంటలకు 84.19 శాతం మంది లబ్ధిదారులు ఇంటి వద్దే పింఛన్‌ అందుకోగా 2 గంటల కల్లా æ88.27 శాతం మందికి పంపిణీ పూర్తయింది. 
– కరోనా వల్ల పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో లబ్ధిదారుల ఫోటో ఐడెంటిఫికేషన్‌ ను వలంటీర్లు నిర్ధారించడం, జియో ట్యాగింగ్‌ ద్వారా ఫోటోను యాప్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా పంపిణీని సులభతరం చేశారు. 

మరిన్ని వార్తలు