రికార్డులు మాయం

20 Feb, 2019 07:04 IST|Sakshi
కార్యాలయం, తహసీల్దారు కృష్ణమూర్తికి ఫిర్యాదు చేస్తున్న నాయకులు

కోడిగూడెం వీఆర్వో కార్యాలయంలో ఘటన

ఏసీబీ అధికారులకు చిక్కకుండా చేసిన వైనం

అవినీతి వీఆర్వో కుమారుడు, తమ్ముడిపై తహసీల్దారుకు ఫిర్యాదు

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: మండలంలోని కోడిగూడెం వీఆర్వో కార్యాలయంలో రికార్డులు మాయమయ్యాయి. దీనిపై స్థానికులు మంగళవారం ఉదయం ద్వారకాతిరుమల తహసీల్దారు ఎం.కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం రాత్రి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన కోడిగూడెం (సీహెచ్‌ పోతేపల్లి ఇన్‌చార్జి) వీఆర్వో వి.సుబ్రహ్మణ్యం కుమారుడు, అతని తమ్ముడే రికార్డులను మాయం చేశారని పేర్కొన్నారు. స్థానికు ల కథనం ప్రకారం.. దెందులూరు మం డలం చల్లచింతలపూడికి చెందిన సుబ్ర హ్మణ్యం ఐదేళ్ల నుంచి కోడిగూడెం వీఆ ర్వోగా పనిచేస్తున్నాడు. ఈయన పనిచేయాలంటే ఎంతోకొంత సొమ్ము ముట్టజెప్పాల్సిందే.

కౌలు పత్రం నుంచి పాస్‌ బుక్‌ వరకు ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించారు. గొడవలెందుకని భావించిన రైతులు పని త్వరగా పూర్తిచేసుకునేందు కు వీఆర్వో అడిగినంతా ముట్టజెబుతున్నారు. ఇలా చేయని వారి పాస్‌ పుస్తకా లు, ఇతర కాగితాలు తన కార్యాలయంలోనే ఉంచేవాడు. ఎన్నిసార్లు మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వాటిని పరిశీలించకుండానే తిరస్కరించేవాడు. ఈ క్రమంలోనే దొరసానిపాడుకు చెందిన రైతు రాయపాటి నాగేశ్వరరావు కుమారుడు లీలాకృష్ణమూర్తికి డిజిటల్‌ ఈ పాస్‌ పుస్తకాలు ఇచ్చేం దుకు రూ.4 వేలను డిమాండ్‌ చేశాడు. దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, వీఆర్వో సుబ్రహ్మణ్యంకు లంచ ం సొమ్ము రూ.4 వేలు ఇస్తూ సోమవారం రాత్రి పట్టించిన విషయం తెలిసిందే.

విచారణకు హామీ
వీఆర్వో సుబ్రహ్మణ్యం ఏసీబీ అధికారుల కు పట్టుబడటంతో, ఆయన కుమారుడు, తమ్ముడు సోమవారం అర్ధరాత్రి కోడిగూడెం వీఆర్‌ఏ సైదు కాశీం ఇంటికి వెళ్లారు. ఆ తరువాత కాశీంతో వీఆర్వో కార్యాలయం తలుపులు తెరిపించి పాస్‌ పుస్తకాలు, గొలుసు, తదితర పత్రాలను తీసుకెళ్లిపోయారు. దీనిపై గ్రామస్తులు కొంద రు కాశీంను నిలదీయడంతో అసలు విష యం బయటకొచ్చింది. ఈ వ్యవహారమంతా ఒక కాగితంపై రాసి కాశీంతో సం తకం చేయించారు. రైతులకు సంబంధించిన పాస్‌ పుస్తకాలు, కాగితాలు పెద్ద ఎత్తున వీఆర్వో కార్యాలయంలో దొరికి తే, అవి ఎందుకు పెండింగ్‌లో ఉంచారనే ప్రశ్నలు ఎదురౌతాయన్న ఉద్దేశంతోనే వాటిని దొంగిలించారని స్థానికులు చెబుతున్నారు. రికార్డుల మాయంపై విచారణ చేస్తానని గ్రామస్తులు, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ ప్రతాపనేని వాసు, చెలికాని బుల్లియ్య, బీజేపీ జిల్లా నేత తాండ్ర శేషగిరిరావులకు తహసీల్దారు కృష్ణమూర్తి హామీ ఇచ్చారు.

కనిపించని ఫైల్‌
ఇదిలా ఉండగా వీఆర్వోను ఏసీబీ అధికారులకు పట్టించిన రైతుకు సంబం ధించి ఫైల్‌ తహసీల్దారు కార్యాలయంలో దొరకలేదు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ సిబ్బంది ఫైల్‌ కోసం రికార్డు రూములో వెదికినా ఫలితం లేదు. ఐతే కోడిగూడెంలోని వీఆర్వో కార్యాలయంలో మాయమైన రికార్డుల్లో, ఈ ఫైల్‌ ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

జనన ధ్రువీకరణకు రూ.5 వేలు
జనన ధ్రువీకరణ పత్రం ఇస్తానని చెప్పి గతేడాది రూ.5 వేలు తీసుకున్నాడు. రేపు మాపు అంటూ తిప్పాడు. అసలు ఆ పత్రం ఇచ్చేది వీఆర్వో కాదని తెలుసుకుని, నా డబ్బులు ఇవ్వమని ఎన్నోసార్లు వెంటపడ్డాను. సరైన సమాదానం చెప్పలేదు. చేసేదేం లేక ఇక ఊరుకున్నాను.– చవల దుర్గారావు, కోడిగూడెం, గ్రామస్తుడు

ఈ పాస్‌ పుస్తకాల కోసం వసూలు
నా పొలానికి మేన్యువల్‌ పాస్‌ పుస్తకాలున్నాయి. వాటిని మార్చి డిజిటల్‌ ఈ పాస్‌ పుస్తకాలు ఇస్తానని చెప్పి తొలుత రూ.1500, ఆ తరువాత పొలం కొలతలంటూ రూ.3 వేలు తీసుకున్నాడు. అలాగే పాత పాస్‌ పుస్తకాల జిరాక్స్‌ కాపీలను దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా డబ్బులు కావాలని అడిగాడు. వీఆర్వో చుట్టూ తిరగలేక ఊరుకున్నాను.– పాలం రాంబాబు, కోడిగూడెం, గ్రామస్తుడు

ఎకరమైనా, అరెకరమైనా ఒకే రేటు
నా పొలం పాస్‌ పుస్తకాలను ఈ పాస్‌ పుస్తకాలుగా మార్చేందుకు అరెకరానికి రూ.5 వేలు మరో ఎకరానికి మరో రూ.5 వేలు తీసు కున్నాడు. ఉన్నతాధికారులకు చెబుదామంటే పనులు అవ్వవని భయపడేవాళ్లం. వీఆర్వో ఏసీబీ అధికారులకు దొరకడంతో రికార్డులను మాయం చేశారు.– బచ్చు శ్రీనివాసరావు, కోడిగూడెం, గ్రామస్తుడు

మరిన్ని వార్తలు