తెలంగాణ ఫలితాలు బాబుకు చెంపపెట్టు

14 Dec, 2018 08:55 IST|Sakshi
రెడ్డి శాంతి

విలువల్లేని టీడీపీకి ఏపీలోనూ పతనం తప్పదు

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి

శ్రీకాకుళం , పాతపట్నం/ఎల్‌.ఎన్‌.పేట: విలువలు లేకుండా సొంత లాభం కోసం సిద్ధాంతాలను మరిచి కాంగ్రెస్‌పార్టీతో జతకట్టి, ప్రజాకూటమి పేరుతో మోసం చేయాలని చూసిన ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ఫలితాలు చెంపపెట్టు లాంటింవని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో తిత్లీ తుపాను, తీవ్ర వర్షాభావం నెలకొని దుర్భిక్ష పరిస్థితుల్లో ప్రజలు అల్లాడి పోతుంటే సీఎం మాత్రం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ గొప్పలకు పోతున్నారని విమర్శించారు. ఒడిశాలో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. రాష్ట్రంలో సంపాదించిన అవినీతి సొమ్ముతో వందల కోట్ల రూపాయలు తెలంగాణా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఆరోపించారు. టీడీపీ అవినీతిని చూసి తెలంగాణ ప్రజలకు విరక్తిపుట్టి, ప్రజాకూటమికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. చంద్రబాబు ప్రచారంతో కాంగ్రెస్‌పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. తానే హైటెక్‌ సిటీని నిర్మించినట్లు చెప్పిన పరిసర ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్‌పల్లిలో కూటమి అభ్యర్థులు 40 వేల ఓట్లకు పైగా వ్యత్యాసంతో ఓడిపోవడం చూస్తే ప్రజల్లో టీడీపీపై ఉన్న వ్యతిరేకత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చునని స్పష్టంచేశారు. విలువల్లేని టీడీపీకి ఏపీలోనూ పరాభవం తప్పదని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు