ఇంజినీరింగ్‌ విద్యలో సంస్కరణలు

3 Apr, 2019 10:06 IST|Sakshi
సదస్సుకు హాజరైన ప్రతినిధులు 

సాక్షి, రామారావుపేట (కాకినాడ లీగల్‌): ఇంజినీరింగ్‌ పాఠ్య ప్రణాళికలో ఏఐసీటీఈ నిర్దేశ నియమాలను అనుసరించి రెండు ముఖ్యమైన సంస్కరణలు ప్రవేశపెట్టామని జేఎన్‌టీయూకే ఉపకులపతి ఎం.రామలింగరాజు తెలిపారు. వర్సిటీ ప్రాంగణం సెనేట్‌ హాలులో ‘ఇంజినీరింగ్‌ పాఠ్య ప్రణాళికాభివృద్ధి, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌’ సమావేశం డైరెక్టరేట్‌ ఆఫ్‌ అకడమిక్, ప్లానింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేఎన్‌టీయూకే వీసీ ఎం.రామలింగరాజు, ప్రత్యేక అతిథులుగా ఏపీ ఎస్‌సీహెచ్‌ఈ వైస్‌ చైర్మన్‌ టి.కోటేశ్వరరావు, కార్యదర్శి ఎస్‌.వరదరాజన్, ఏపీ ఎస్‌ఎస్‌డీసీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ గంటా సుబ్బారావు, గీతం వర్సిటీ వీసీ ఎన్‌.శివప్రసాద్, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.కృష్ణయ్య, గౌరవ అతిథులుగా రెక్టార్‌ ఐ.శాంతిప్రభ వేదికనలంకరించగా రిజిస్ట్రార్‌ వీవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా వీసీ రామలింగరాజు మాట్లాడుతూ అవుట్‌కమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్, బ్లూమ్స్‌ టాగ్జానమీ ప్రకారం బోధన జరుగుతుందని, దీనిని మరింత బలోపేతం చేయడానికి ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఇంటర్న్‌షిప్స్‌ ప్రాజెక్టŠస్‌ తదితర వాటిని పాఠ్య ప్రణాళికలో ప్రవేశపెట్టదలిచామన్నారు. ప్రస్తుతం 2019 రెగ్యులేషన్స్‌ ప్రకారం ఇంజినీరింగ్‌ విద్యార్థులు నాలుగేళ్ల కోర్సులో కనీసం నాలుగు ప్రాజెక్టులు చేసేలా రూపొందిస్తామన్నారు. 


ప్రొఫెసర్‌ టి.కోటేశ్వరరావు మాట్లాడుతూ  ఇంజినీరింగ్‌ పాఠ్యప్రణాళిక అన్ని యూనివర్సిటీలకు ఒకేలా ఉండేలా రూపొందించడమే తమ లక్ష్యమన్నారు. ఎస్‌.వరదరాజన్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఎన్‌పీ టెల్‌ ఆన్‌లైన్‌ కోర్సులు నేర్చుకోవాలని, ఫీల్డ్‌ వర్క్‌ చేయాలని, అలానే పాఠ్యప్రణాళికలో వర్చ్యువల్‌ రియాల్టీని ప్రవేశ పెట్టబోతున్నామన్నారు. ఎన్‌.కృష్ణయ్య మాట్లాడుతూ తరగతి గదిలో అధ్యాపకుడు గంటలో 15 నిమిషాలకు మించి మాట్లాడకూడదని, విద్యార్థులను ప్రయోగ పద్ధతిలో మిగిలిన 45 నిమిషాలు కార్యాచరణలో నిమగ్నమయ్యేలా పాఠ్యాంశాలను రూపొందించాలన్నారు.

గంజా సుబ్బారావు మాట్లాడుతూ లక్ష్యానికి చేరువయ్యేలా పలు శిక్షణలను కల్పించాలని, పాఠ్యాంశం నుంచి నేర్చుకుని మార్కులు పొందేలా కాకుండా సృజనాత్మకతను జోడించి పరిశోధనను అభివృద్ధి పరిచి ఆవిష్కరణలకు పెద్దపీట వేసేలా ఇంజినీరింగ్‌ పాఠ్య ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ప్రొఫెసర్‌ శివప్రసాద్‌ మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ పాఠ్యప్రణాళిక పరిశ్రమలకు అనుగుణంగా రూపొందించనున్నామన్నారు. కార్యక్రమానికి డైరెక్టర్లు, కమిటీ సభ్యులు, బీవోఎస్‌ చైర్‌పర్సన్లు, సభ్యులు, విభాగాధిపతులు, అధ్యాపకులు, యుసీఈకే యుసీఈవీ, యుసీఈఎన్‌ ప్రిన్సిపాల్స్, వైస్‌ ప్రిన్సిపాల్స్, అటానమస్, అనుబంధ కళాశాల ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు. 

 

మరిన్ని వార్తలు