నకిలీ పుస్తకాలతో రిజిస్ట్రేషన్లు

28 Jun, 2016 23:21 IST|Sakshi

 విజయనగరం కంటోన్మెంట్: భూముల విలువ పెరిగిన తరువాత జిల్లాలో భూ తగాదాలు ఎక్కువవుతున్నాయి. నిత్యం సాగు చేసుకుంటున్న తమ భూములను కొందరు అక్రమార్కులు నకిలీ పత్రాలతో రెండు సార్లు క్రయ విక్రయాలు చేశారనీ ఇప్పుడు వాటిని వదిలేయాలని బెదిరిస్తున్నారని కలెక్టరేట్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
 
  గరివిడి మండలం కాపు శంభాం గ్రామానికి చెందిన ఏనూ తల అప్పమ్మ అనే వృద్ధురాలి పేరున ఉన్న భూమిని పలువురు ఆక్రమణ దారులు బోగస్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఈ అన్యాయంపై కోర్టుకు వెళ్లినా పోలీసులు తమ ఇంటికి వచ్చి తాము అన్యాయం చేసినట్టు జీపెక్కించి స్టేషన్‌కు తీసుకెళుతూ తమను మానసికంగా హింసిస్తున్నారని డైలీ గ్రీవెన్స్ సెల్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
 
 తాత తండ్రుల నుంచి అనుభవిస్తున్న సర్వే నంబర్ 6-9లోని 2ఎకరాలు, 6-16లోని 52 సెంట్ల భూమిని చందక రమణ, లెంక సుశీల అనే ఇద్దరు వ్యక్తులు దాసరి అప్పయ్య అనే వ్యక్తి పేరుతో బినామీ రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు. వారిద్దరూ గొట్టిముక్కల వెంకట రమణమూర్తి రాజు, జనపాల ప్రసాద్ బాబు తదితరులకు విక్రయించారన్నారు.
 
  ఈ విషయం తెలిసి తాము ఏడీఎం కోర్టులో కేసు వే యగా ప్రస్తుతం విచారణ సాగుతోందన్నారు. దావా నడుస్తున్నప్పటికీ ఉపసంహరించుకోవాల్సిందిగా బెదిరిస్తున్నారని బాధితురాలు ఏనూతల అప్పమ్మ, కుమారుడు అప్పలనాయుడులు వాపోయారు. కేసు వెనక్కి తీసుకోకపోతే తమను చంపేస్తామని హెచ్చరిస్తున్నారని వాపోయారు.   కోర్టు కేసు ఉండగా మళ్లీ మమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని తమకు న్యాయం చేయాలని డైలీ గ్రీవెన్స్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.
 

మరిన్ని వార్తలు