సీఎం జగన్‌ చొరవతోనే మత్స్యకారుల విడుదల

5 Jan, 2020 05:47 IST|Sakshi
చందువా చేపలను పరిశీలిస్తున్న మంత్రి మోపిదేవి

మంత్రి మోపిదేవి వెంకటరమణారావు

సాక్షి, అమరావతి/భావదేవరపల్లి–నాగాయలంక (అవనిగడ్డ): పాకిస్తాన్‌ జైల్లో ఉన్న మత్స్యకారులను విడిపించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేశారని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో బాధిత కుటుంబ సభ్యులు సమస్యను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఢిల్లీ వెళ్లిన ప్రతీసారీ ప్రధాని, అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారన్నారు. అమిత్‌షాకు 2019 ఆగష్టు 31న సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ రాశారని, తరువాత పాకిస్తాన్‌ ప్రభుత్వం డిసెంబర్‌ 31న మత్స్యకారులను రిలీజ్‌ చేయడానికి అంగీకరిస్తూ విదేశాంగ శాఖకు సమాచారం పంపించిందన్నారు.

సీఎం చొరవతో ఈనెల 6న సాయంత్రం 4 గంటలకు 20 మంది మత్స్యకారులు వాఘా సరిహద్దు ద్వారా భారతదేశంలోకి చేరుకుంటారన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మరో నెల రోజుల్లో వస్తారన్నారు. కాగా, కోస్తా తీరంలో చేప ఉత్పత్తులకు సంబంధించి దివిసీమ జోన్‌లో ప్రత్యేక క్లస్టర్‌గా పాంపినో, సీబాస్, జెల్ల చేపల విత్తన కేంద్రాలు (హేచరీస్‌)ను మార్కెట్‌లోకి తీసుకువచ్చే కార్యాచరణ చేపట్టబోతున్నట్లు మంత్రి మోపిదేవి తెలిపారు. నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ప్రయోగాత్మకంగా చెరువులలో పెంచిన ఉప్పునీటి చందువా చేపల పట్టుబడి కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబుతో కలసి ఆయన ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు