ఈ-సెట్ ఫలితాల విడుదల

20 May, 2014 00:55 IST|Sakshi
ఈ-సెట్ ఫలితాల విడుదల

89.24 శాతం ఉత్తీర్ణత   ఉత్తీర్ణులకు ప్రభుత్వ కళాశాలల్లోనూ సెకండియర్‌లో చేరే అవకాశం
 
కాకినాడ : ఈ-సెట్ -2014 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ వై.వేణుగోపాలరెడ్డి జేఎన్‌టీయూకేలో సోమవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో ఈనెల 10న 12 రీజనల్ సెంటర్లలో 99 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ-సెట్‌కు 48,705 మంది విద్యార్థులు హాజరుకాగా 43,466 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.24 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వేణుగోపాలరెడ్డి చెప్పారు. ఈ-సెట్ ను మూడుసార్లు విజయవంతంగా నిర్వహించి, అనుకున్న తేదీకల్లా ఫలితాలను విడుదల చేసిన జేఎన్‌టీయూకే అధికారులను అభినందించారు. ఈ ఏడాది నుంచి ఈ-సెట్ ఉత్తీర్ణులు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో సైతం రెండో సంవత్సరంలో చేరే అవకాశం కల్పించామని చెప్పారు. వీసీ డాక్టర్ జి.తులసీరామ్‌దాస్ మాట్లాడుతూ.. ఈ-సెట్ విద్యార్థు బార్‌కోడ్ షీట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో ఈ-సెట్ కన్వీనర్ డాక్టర్ సి.హెచ్.సాయిబాబు, వర్సిటీ రెక్టార్ డాక్టర్ బి.ప్రభాకరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు పాల్గొన్నారు.

 ర్యాంకర్లువీరే: వివిధ బ్రాంచ్‌లలో మొదటి, రెండో ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.. (సీటీ బ్రాంచ్‌లో హాజరైన ఒకే ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించగా, సీఆర్‌టీ బ్రాంచ్‌లో ముగ్గురు హాజరైతే ఇద్దరు ఉత్తీర్ణుల య్యారు) సివిల్ : వలుపదాసు నీలిమ (హన్మకొండ, వరంగల్ జిల్లా), గుండాల ధనుంజయ్ (నల్గొండ). ఈఈఈ : కాండ్రేగుల సాయి (విశాఖపట్నం), బుర్రా కరుణప్రియ (అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా). ఎంఈసీ : రామ్‌బా అశోక్ (విజయనగరం), చిన్నకొట్ల గణేష్ (అనంతపురం). ఈసీఈ : మంచే హరీష్ (నిజామాబాద్), నేమాని నవీన్ (వరంగల్). సీఎస్‌ఈ : వి.నరేంద్ర (హైదరాబాద్), చింతా వెంకటరమణ (అనంతపురం). సీహెచ్‌ఈ : పసుమర్తి సత్యసాయి (వద్దిపర్రు, తూర్పుగోదావరిజిల్లా), రామిరెడ్డి హరికృష్ణ (మక్కువ, విజయనగరం జిల్లా). ఈఐఈ : బి.సంతోషి (మహబూబ్‌నగర్), ఎల్.స్నేహలత (కరీంనగర్). ఎంఈటీ : కిల్లన హేమంతకుమార్ (విజయనగరం), వాకాడ నాగస్వామి కొండలరావు (యు.కొత్తపల్లి,  తూర్పుగోదావరి జిల్లా). ఎంఐఎన్ : బొడ్డు తిరుపతి (మందమర్రి, ఆదిలాబాద్ జిల్లా), కొండర కృష్ణకాంత్ (ఆదిలాబాద్). ఫార్మా : జువేరియా తస్లీమ్ (నల్గొండ), షేక్ దాదా ఖలందార్ (కడప). బీఎస్సీ : యాలంటి అయ్యప్ప (ఒంగోలు), మహంతి జయలక్ష్మి (నెల్లిమర్ల, విజయనగరం జిల్లా).

 
 ఒంగోలు విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

 ఒంగోలు  : ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) లో  ఒంగోలుకు చెందిన వెలనాటి అయ్యప్ప (హాల్‌టికెట్ నెం. 7380011) బీఎస్పీ (మ్యాథ్స్) విభాగంలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈసెట్-2014లో అతడికి 112 మార్కులు వచ్చాయి. ఒంగోలుకు చెందిన అయ్యప్ప నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి రామయ్య స్థానిక ఉడ్ కాంప్లెక్సులో రోజువారీ రిక్షా కూలీగా పనిచేస్తుంటాడు. ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగా ఉన్నా కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలన్న రామయ్య కలను అయ్యప్ప నెరవేర్చాడు. అయ్యప్ప విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్‌లో చేరి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడమే తన జీవిత లక్ష్యమని అయ్యప్ప చెప్పారు.
 

మరిన్ని వార్తలు