పెద్దారెడ్డికి రిమాండ్‌

1 Sep, 2018 11:50 IST|Sakshi
పెద్దారెడ్డిని సబ్‌ జైలుకు తరలిస్తున్న పోలీసులు

అనంతపురం, గుత్తి: వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డికి గుత్తి జేఎఫ్‌సీఎం మంజులత 14 రోజుల రిమాండ్‌ విధించారు. రెండు రోజులుగా యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకులు అకారణంగా దాడులకు పాల్పడుతున్నారు. దాడులను ఖండించినందుకు పెద్దారెడ్డిపై 147, 148, 448, 354, 307, 506 రెడ్‌ విత్‌ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. గత గురువారం రాత్రి పెద్దారెడ్డిని తాడిపత్రి, యల్లనూరు పోలీసులు అరెస్టు చేసి పామిడి పోలీసుస్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం గుత్తి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తదనంతరం జేఎఫ్‌సీఎం మంజులత ఎదుట హాజరు పరిచారు. 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ తాడిపత్రి సబ్‌ జైలుకు తరలించాలని ఆదేశించారు. తాడిపత్రి సబ్‌జైలుకు తరలిస్తే అక్కడ లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ వస్తుందని పోలీసులు విన్నవించడంతో తర్వాత గుత్తి స్పెషల్‌ సబ్‌ జైలుకు తరలించాలని ఆదేశించారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డిని గుత్తి సబ్‌జైలుకు భారీ బందోబస్తు మధ్య తరలించారు.  

నేతల పరామర్శ
గుత్తి స్పెషల్‌ సబ్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని శుక్రవారం వైఎస్సార్‌సీపీ ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిలతో కలిసి అనంత పరామర్శించారు. అనంతరం సబ్‌ జైలు ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో జేసీ బ్రదర్స్‌ అరాచకాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని అనంత ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బుసా సుధీర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్‌ యాదవ్, పట్టణ కన్వీనర్‌ పీరా, జిల్లా కార్యదర్శి గురుప్రసాద్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు