ఓటు.. ఆన్‌లైన్‌ వేటు

11 Mar, 2019 09:30 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్రలు

189 కొత్తపల్లెలో 111 ఫారం–7 దరఖాస్తులు  

సాక్షి, గుడిపాల: అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అక్రమాలకు తెరలేపింది. వైఎస్సార్‌సీపీ ఓటర్లే తొలగింపు లక్ష్యంగా భారీగా కుట్రలు పన్నుతోంది. తెలుగుదేశం నాయకులు.. వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఇటీవల ఫారం–7 కింద  189 కొత్తపల్లె పంచాయతీలో 111 మంది అర్హులైన ఓటర్లను తొలగించేందుకు దరఖాస్తు చేశారు. ఓటు తొలగించాలని తాము ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేదని స్వయంగా బాధిత ఓటరే చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఈ విషయంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి ఓట్ల దొంగల అక్రమాలకు చరమగీతం పాడాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఊర్లో ఉన్నా ఓటు తీసేస్తారా?
గ్రామంలో కూలిపని చేసుకొని జీవిస్తున్నాను. ఊర్లో ఉన్నవారి ఓట్లను తొలగించే అధికారం టీడీపీ నాయకులకు ఎవరిచ్చారు. మాకు తెలియకుండా ఆన్‌లైన్‌లో ఎవరు దరఖాస్తు చేశారో అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలి. వైఎస్‌ జగన్‌కు ఓటువేస్తామని ఉద్దేశంతోనే ఇలాంటి అడ్డదారులు ఎంచుకుంటున్నారు. 
–(చిన్నపాప,189కొత్తపల్లె)గుడిపాల

దుర్మార్గమైన చర్య
మేం గ్రామంలో 20ఏళ్లుగా ఉంటున్నాం. ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మాకు తెలియకుండానే మా ఇంట్లో వారి ఓట్లను తొలగించేశారు. గ్రామంలో ఉన్న మా ఓట్లను ఎలా తొలగిస్తారు. ఇది దర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకొనే ఎవరికైనా ఉంది. పిరికిపందెలే ఇలా చేసేది. 
–(మణివేలు,189కొత్తపల్లె)గుడిపాల

వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లే లక్ష్యం
వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లనే టార్గెట్‌ చేసి తీయించేస్తున్నారు. గ్రామంలో ఉన్నవారి ఓట్లను తీసేందుకు టీడీపీ నాయకులు యత్నిస్తున్నారు. ప్రజల మద్దతు లేనివారే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఓటుతో వారికి ఈసారి తగిన బుద్ధి చెబుతాం. ఓటు వేయడంలో చాలా కసిగా ఉన్నాం. ఫారం–7 దరఖాస్తు చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.
–(కర్ణల్,189కొత్తపల్లె)గుడిపాల

డేటా చోరీ కుట్రపూరితమే..
అధికార పార్టీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ  గ్రిడ్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడం కుట్రలో భాగమే. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రజల సమాచారం ప్రైవేట్‌ సంస్థకు వెళ్లే ఆస్కారమే లేదు. ప్రభుత్వ అండదండలతోనే వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి ఆ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వద్ద ఉన్న యాప్‌ద్వారా ఓటర్ల తొలగింపునకు పాల్పడుతున్నారు.  
–(గోకుల్,189కొత్తపల్లె) గుడిపాల

నాపేరుపై 38 దరఖాస్తులు వచ్చాయి
189కొత్తపల్లె వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్‌గా ఉండి కూడా మా ఓట్లు తొలగింపునకు ఎందుకు ఫారం–7 ఇస్తాం. వైఎస్సార్‌సీపీ ఓట్లు గల్లంతు చేసేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా టీడీపీ నాయకులు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. నాపేరుతో దరఖాస్తు చేసి 38ఓట్లను తొలగించేలా చేశారు. అంతా వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులనే టార్గెట్‌ చేస్తున్నారు. ఈ కుట్రను తిప్పికొడతాం.
–(కారిమేగన్, వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్, 189కొత్తపల్లె) గుడిపాల

మా ఇద్దరి ఓట్లూ..
నా వయస్సు 67 సంవత్సరాలు. ఇదే గ్రామంలో పోస్ట్‌మాస్టర్‌గా ఉండి రిటైర్డ్‌ అయ్యాను. ప్రస్తుతం ఇదే గ్రామంలోనే జీవనం సాగిస్తున్నాను. నాతో పాటు నా భార్య ఓటును కూడా తొలగించేందుకు కుట్రపన్నారు. ఓటు తొలగింపు కోసం  ఆన్‌లైన్‌లో ఫారం–7ను దరఖాస్తు చేశారు. ఇది ఎవరి కుట్రో తెలియడం లేదు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
    –(వసంత,ముస్వామి దంపతులు, 189కొత్తపల్లె) గుడిపాల

మండలం : గుడిపాల
 పంచాయతీ : 189 కొత్తపల్లె
మొత్తం ఓట్లు : 2,138
పురుషులు :1,077
స్త్రీలు :1,061
ఫామ్‌–7 ద్వారా వచ్చిన దరఖాస్తులు :111

మరిన్ని వార్తలు