శ్రీవారి ఆలయంలో 17వ తేదీ నుంచి నివేదన
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసో త్సవాల్లో అత్యంత ముఖ్యమైందిగా భావించే ధనుర్మాసం ఈ నెల 16న ప్రారంభం కానుంది. ఆ రోజు అర్ధరాత్రి 11.47 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ధనుర్మాస ఘడియలు 2020 జనవరి 14వ తేదీన ముగుస్తాయి.
తిరుప్పావై పారాయణం
12 మంది ఆళ్వార్లలో శ్రీఆండాళ్ (గోదాదేవి) ఒకరు. శ్రీవారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. శ్రీవారి ఆలయంలో నెల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు.