‘గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు’

26 Jan, 2020 11:38 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి​ గణతంత్ర దినోత్సవం ఇది. ఈ లోపే సీఎం వైఎస్ జగన్‌ ఇచ్చిన హామీలన్నింటినీ దాదాపు అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చారు.

సీఎం వైఎస్‌ జగన్‌ బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే హామీలు అమలు చేయడం మొదలుపెట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రతి గడపకు ఆయన సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షలుకుపైగా ఉద్యోగాలు కల్పించారు. టీడీపీ అధ్యక్షుడు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టకోలేదు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు