పరిశోధనలకు పదును పెట్టాలి

31 Oct, 2013 03:37 IST|Sakshi

చంద్రగిరి, న్యూస్‌లైన్: ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత్‌లో శాస్త్రవేత్తలు పరిశోధనలకు పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ పిలుపునిచ్చారు. శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల్లో బుధవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన కస్తూరి రంగన్ మాట్లాడుతూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగే లక్ష్యంతో చదవాలని సూచించారు. భారత ప్రభుత్వం పరిశోధనలకు పెద్దపీట వేస్తోందని, శాస్త్రవేత్తలకు మంచి గుర్తింపు ఇస్తోందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం 300 మంది ఎంటెక్, ఎంసీఏ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అంతకుముందు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్, సినీనటుడు మోహన్‌బాబు, విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణువర్ధన్‌బాబు, చెన్నైకి చెందిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ డెరైక్టర్ ప్రొఫెసర్ నారాయణరావు మాట్లాడుతూ భావితరానికి వెలుగును అందించేందుకు పరిశోధనలు తప్పకుండా జరగాలన్నారు.

ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ ప్రొఫెసర్ శశిధర్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ప్రత్యేకాధికారి గోపాలరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీసీ కృష్ణమాచారి, సినీ నటుడు మంచు మనోజ్‌కుమార్, పలువురు విభాగాధిపతులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు