52 రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్‌ కౌంటర్లు

24 May, 2020 05:00 IST|Sakshi

జూన్‌ 1 నుంచి దేశ వ్యాప్తంగా 200 రైళ్లు ప్రారంభం

సికింద్రాబాద్‌–గుంటూరు, సికింద్రాబాద్‌–హౌరా, తిరుపతి–నిజాముద్దీన్‌కు రైళ్లు

విశాఖ–న్యూఢిల్లీ, హౌరా–యశ్వంత్‌పూర్‌ మధ్య ఫాస్ట్‌ రైళ్లు

టిక్కెట్‌ కన్ఫర్మ్‌ అయిన వారికే రైల్వే స్టేషన్‌లోకి అనుమతి

సాక్షి, అమరావతి: వచ్చే నెల 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 200 రైలు సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్‌లో టిక్కెట్ల రిజర్వేషన్‌ కోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా రైల్వే స్టేషన్లలోనూ కౌంటర్లు ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏపీకి సంబంధించి 52 రైల్వే స్టేషన్లలో టిక్కెట్‌ కౌంటర్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌లో ఉంచిన టిక్కెట్లు శుక్రవారం గంటల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే 200 రైళ్లలో ఏపీకి, ఏపీ మీదుగా ప్రధానంగా ఐదు రైళ్లు వెళ్లనున్నాయి. టిక్కెట్‌ కన్ఫర్మ్‌ అయితేనే రైల్వే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ఈ రైళ్లకు జనరల్‌ బోగీలు ఉండవు. మొత్తం రిజర్వ్‌డ్‌ బోగీలతోనే నడుస్తాయి. 

► సికింద్రాబాద్‌–గుంటూరు, సికింద్రాబాద్‌–హౌరాకు ప్రతి రోజూ రైళ్లను నడపనున్నారు. వీటికి ఇప్పటికే వెయిటింగ్‌ లిస్ట్‌ చాంతాడంత ఉంది. 
► తిరుపతి–నిజాముద్దీన్‌ రైలుకు కూడా డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. 
► విశాఖ–న్యూ ఢిల్లీ, హౌరా–యశ్వంత్‌పూర్‌కు ఫాస్ట్‌ రైళ్లను నడపనున్నారు. 
► ప్రత్యేక రైళ్లు నడిచే ప్రధాన స్టేషన్లలో టిక్కెట్‌ రిజర్వేషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు.   
► అడ్వాన్స్‌ బుకింగ్‌ సౌకర్యాన్ని 30 రోజులకు పెంచింది. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లను కూడా జారీ చేయనున్నట్టు తెలిపింది.  
► ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి అరగంట ముందు చార్ట్‌ను విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది.  
► టికెట్లను ఇప్పుడు రిజర్వేషన్‌ కౌంటర్లు, పోస్టాఫీసులు, ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్ల నుంచి కూడా బుక్‌ చేసుకోవచ్చని రైల్వే 
తెలిపింది.

మరిన్ని వార్తలు