‘అనుమతులు రాగానే బస్సులు నడుపుతాం’

29 May, 2020 21:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నడిచి వెళ్లే వలస కూలీల తరలింపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు అందాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారి కృష్ణబాబు అన్నారు.  నడిచి వెళ్లే వలస కూలీలను ఆపి.. షెల్టర్లకు పంపిస్తున్నామని చెప్పారు. వారికి కౌన్సిలింగ్ చేసి బస్సుల్లో, రైళ్లల్లో స్వస్థలాకు తరలిస్తున్నామన్నారు. ఆయన మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ.. ‘ఇతర రాష్ట్రాలకు చెందిన 17,273 మందిని ఆయా ప్రాంతాలకు చేరవేశాం. వలస కూలీల కోసం 75 రైళ్లను వివిధ రాష్ట్రాలకు నడిపాం. మొత్తంగా 86 వేల 883 మంది వలస కూలీలను  స్వస్థలాలకు పంపించాం. ఈరోజు మూడు రైళ్లు వెళ్తాయి. రాబోయే రోజుల్లో రెండు లేదా 3 రైళ్లు నడుపుతాం. వలస కూలీలందరినీ స్వస్థలాలకు పంపిస్తాం. 

ఇప్పటి వరకు 10 విమానాల ద్వారా 1535 మంది విదేశాలు, పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. జూన్ 1 తర్వాత కేంద్రం మార్గదర్శకాలను బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటాం. వచ్చే నెల 1 తర్వాత 28 రైళ్లు రాష్ట్రం మీదుగా వస్తున్నాయి. ఆటోలు 1+2, కార్లు 1+3, మినీ వ్యాన్లు 50 శాతం ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతి ఇస్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చే వారిని తీసుకువచ్చేందుకు తెలంగాణ నుంచి అనుమతి లేదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే బస్సులు నడుపుతాం. రాష్ట్రంలో 25 శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. బస్సు ప్రయాణానికి రెస్పాన్స్ అంతగా లేదు. ఆర్టీసీ బస్సుల్లో 45 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) వస్తోంది.

మరిన్ని వార్తలు