రివర్స్‌ టెండరింగ్‌!

19 Jul, 2019 03:08 IST|Sakshi

పోలవరం జలాశయం, జలవిద్యుదుత్పత్తి కేంద్రాలకు  రివర్స్‌ టెండరింగ్‌

ఒకే ప్యాకేజీ కింద టెండర్‌ నోటిఫికేషన్‌ పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల ఐబీఎం రూ. 6,525.56 కోట్లు

తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌తో ఒప్పందం

దీనివల్ల భారీగా ప్రజాధనం ఖజానాకు ఆదా అవుతుందని నిపుణుల అంచనా

రివర్స్‌ టెండరింగ్‌కు అనుమతివ్వాలని కేంద్ర జల్‌ శక్తికి ప్రతిపాదనలు

కేంద్ర జల్‌ శక్తి.. పీపీఏ అనుమతించగానే రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ

అక్టోబర్‌ నాటికి రివర్స్‌ టెండరింగ్‌ పూర్తి.. నవంబర్‌ నుంచి పనులు ప్రారంభం

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌(జలాశయం), జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి.. ఆ పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) గెజిట్‌ నోటిఫికేషన్‌లో సెక్షన్‌ 9(1) ప్రకారం కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయాలన్నా, కొత్తగా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నా కేంద్ర జల్‌ శక్తి శాఖ, పీపీఏల అనుమతి తప్పనిసరి. టీడీపీ ప్రభుత్వ హయాంలో పీపీఏ అనుమతి లేకుండా హెడ్‌ వర్క్స్‌లో రూ. 1,385 కోట్ల విలువైన పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి తప్పించి.. వాటికి నవంబర్‌ 27, 2017న ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)–ఓపెన్‌ పద్ధతిలో టెండర్లు పిలవడాన్ని కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది.

ఇది అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో హెడ్‌ వర్క్స్‌ పనుల్లో ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థతో చేసుకున్న రెండు ఒప్పందాలు.. నవయుగ సంస్థతో రూ. 2,917.78 కోట్ల అంచనా వ్యయంతో చేసుకున్న మూడు ఒప్పందాలు.. బీకెమ్‌ సంస్థతో రూ. 387.56 కోట్ల వ్యయంతో చేసుకున్న ఒక ఒప్పందం వెరసి ఆరు ఒప్పందాలను పూర్తిగా రద్దు చేసుకుని.. హెడ్‌ వర్క్స్‌లో మిగిలిన పనుల విలువ రూ. 3,305.34 కోట్ల (టెండర్‌ డిస్కౌంట్‌ 14.0555 శాతం కలిపితే రూ. 3,529.31 కోట్లు) అంచనా వ్యయంతో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని పీపీఏ, కేంద్ర జల్‌ శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. అనుసంధానాలు (కనెక్టివిటీస్‌) కుడి, ఎడమ కాలువల పనుల్లో అక్రమాలపై నిపుణుల కమిటీ విచారణ చేస్తోంది. వీటిపై ఇచ్చే నివేదిక ఆధారంగా వాటిని కూడా రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఒకే ప్యాకేజీగా.. 
జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఏపీ జెన్‌కో సారథ్యం వహిస్తోంది. హెడ్‌ వర్క్స్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు అంతర్భాగమైన నేపథ్యంలో వాటిని హెడ్‌ వర్క్స్‌లో కలిపి ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తే ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించవచ్చునని, దీనివల్ల సమన్వయలోపం తలెత్తదని.. ఇది ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. కేంద్రం నుంచి అనుమతిరాగానే హెడ్‌ వర్క్స్‌ (రూ.3,305.34 కోట్లు).. జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల(రూ. 3,220.22 కోట్లు)కు ఒకే ప్యాకేజీ కింద రూ. 6,525.56 కోట్లను ఐబీఎం (అంతర్గత అంచనా విలువ)గా నిర్ణయించి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జలవిద్యుదుత్పత్తి కేంద్రం బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. హెడ్‌ వర్క్స్‌ బిల్లులను యథావిథిగా కేంద్రం చెల్లిస్తుంది.

నిగ్గుతేలిన అక్రమాలు..
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్‌ పనుల్లోని అక్రమాలపై విచారణకు ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం  నియమించింది. తొలుత పోలవరం హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులపై విచారణ చేసిన ఆ కమిటీ.. కాంట్రాక్టర్లకు రూ. 2,346.85 కోట్లను టీడీపీ సర్కార్‌ అదనంగా దోచిపెట్టినట్లు తేల్చింది. ఆ కమిటీ ఈనెల 13న ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ప్రస్తుతం హెడ్‌వర్క్స్‌లో ట్రాన్స్‌ట్రాయ్‌తో ఫిబ్రవరి 6, 2013, అక్టోబర్‌ 7, 2016న చేసుకున్న రెండు ఒప్పందాలను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసుకోకుండానే.. హెడ్‌ వర్క్స్‌లో స్పిల్‌ వే పనుల్లో రూ. 1,244.36 కోట్ల విలువైన పనులను ఫిబ్రవరి 17, 2018న, రూ. 921.87 కోట్ల విలువైన పనులను మే 11, 2018న.. రూ. 751.55 కోట్ల విలువైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) పనులను నవంబర్‌ 22, 2018న నవయుగకు ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో అప్పగిస్తూ టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

రూ. 387.56 కోట్ల విలువైన గేట్ల పనులను బీకెమ్‌ సంస్థకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగిస్తూ నవంబర్‌ 11, 2018న ఒప్పందం చేసుకుంది. ఆరు ఒప్పందాల వల్ల వేర్వేరు కాంట్రాక్టర్లు పని చేయడంలో సమన్వయలోపం ఏర్పడుతోంది. దీని వల్ల పోలవరం హెడ్‌ వర్క్స్‌లో అనుకున్న ప్రగతి లేదు. ఇదే అంశాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ అనేక సందర్భాల్లో ఎత్తిచూపారు. హెడ్‌ వర్క్స్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలంటే అన్ని పనులు ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను నవయుగకు అప్పగిస్తూ డిసెంబర్‌ 20, 2017న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలోనే హెడ్‌ వర్క్స్‌.. జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి కాంట్రాక్టర్‌కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రివర్స్‌ టెండరింగ్‌కు కసరత్తు..
దేశంలో కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌లు మాత్రమే రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. మొట్టమొదట రాష్ట్రంలోనే రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలుచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. అందులోనూ తొలిగా పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రివర్స్‌ టెండరింగ్‌కు జలవనరుల శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. 

అక్టోబర్‌ నాటికి కొత్త కాంట్రాక్టర్‌
పోలవరం పనుల్లో కాంట్రాక్టర్లకు టీడీపీ సర్కార్‌ దోచిపెట్టిన సొమ్మును రికవరీ చేయడానికి చర్యలు చేపడుతోంది. రివర్స్‌ టెండరింగ్‌తో భారీ మొత్తంలో ప్రజాధనం ఆదా అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మిగిలే నిధులతో మరిన్ని ప్రాజెక్టుల పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పోలవరం హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు అక్టోబర్‌ నాటికి రివర్స్‌ టెండరింగ్‌ను పూర్తి చేసి కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించింది. కొత్త కాంట్రాక్టర్‌తో నవంబర్‌ నుంచి పనులు ప్రారంభింపజేసి.. జూన్, 2021 నాటికల్లా పనులు పూర్తి చేసి, పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  

రివర్స్‌ టెండరింగ్‌ ఇలా.. 

  • ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లోనే రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
  • ప్రస్తుతం హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించిన విలువనే అంటే రూ. 6,525.56 కోట్లను ఐబీఎంగా నిర్ణయించి రివర్స్‌ టెండర్లు పిలుస్తారు. 
  • అదే సమయంలో ప్రైస్‌ బిడ్‌ తెరిచే రోజున ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లోనే ఆక్షన్‌ (వేలం) నిర్వహిస్తారు. 
  • ఒక టైమ్‌ స్లాట్‌ కేటాయించి నిర్వహించే వేలంలో అతి తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్‌ను ఎల్‌–1గా నిర్ణయిస్తారు. 
  • రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్‌ను ఎల్‌–1గా నిర్ణయిస్తారు. 
  • వేలంలో ఎల్‌–1గా నిలిచిన కాంట్రాక్టర్‌ కోట్‌ చేసిన ధర కన్నా రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో ఎల్‌–1గా నిలిచిన కాంట్రాక్టర్‌ కోట్‌ చేసిన ధర ఎక్కువగా ఉంటే, వేలంలో ఎల్‌–1గా నిలిచిన ధరకు పనులు చేయాలని రివర్స్‌ టెండరింగ్‌లో ఎల్‌–1గా నిలిచిన కాంట్రాక్టర్‌కు ప్రతిపాదిస్తారు.
  • ఇందుకు అంగీకరిస్తే రివర్స్‌ టెండరింగ్‌లో ఎల్‌–1గా నిలిచిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగిస్తారు. లేదంటే వేలంలో ఎల్‌–1గా నిలిచిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగిస్తారు.

>
మరిన్ని వార్తలు