కర్నూల్‌ బియ్యం పేరిట మోసం

2 Jul, 2018 12:15 IST|Sakshi
కర్నూల్‌ బియ్యం పేరిట విక్రయించిన నాసిరకం బియ్యం బస్తాలు

నకరికల్లు: నాణ్యమైన బియ్యం ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నామని ప్రజలను మోసం చేసి అక్రమార్కులు ఆదివారం సొమ్ము చేసుకున్నారు. బ్రాండ్‌ పేరు, సీల్‌చేసిన గోతాలను చూసి కొనుగోలు చేసిన ప్రజలు గోతాల్లోని బియ్యం చూసి లబోదిబోమన్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూల్‌ రైస్‌ పేరిట ఉన్న 25 గోతాల్లో బియ్యంతో కొందరు ఆటోలో వచ్చి విక్రయించారు.

గోతాలపై బ్రాండ్‌ పేరు ఉండడం, ఇంటివద్దకే రావడంతో మహిళలు కొనుగోలు చేశారు. రైస్‌మిల్లు, దుకాణం రేటు కన్నా రూ.50లు తక్కువగా వస్తుందని ఆశపడిన మహిళలు సంతోషంగా కొనుగోలు చేశారు. నకరికల్లు గ్రామంలో సుమారు 10క్వింటాళ్ల వరకు అమ్మినట్లు సమాచారం. కొనుగోలు చేసిన మహిళలు తీరా సాయంకాలం గోతాలు విప్పి చూడగా నాసిరకం బియ్యం ఉండడంతో లబోదిబోమన్నారు. విక్రయించిన వారు ఎవరో తెలియక చేసేది లేక, కర్నూల్‌ రైస్‌ అనగానే కొనుగోలు చేశామని తెల్లముఖం వేశారు.

మరిన్ని వార్తలు