శవాల ‘తోటి’ జీవనం

8 Jan, 2020 12:17 IST|Sakshi
తోటీలు ,మృతదేహం వద్ద తోటీలు, సహాయకులు

30 ఏళ్లుగా ఒకరు...12 ఏళ్లుగా మరొకరు    

వంశ పారంపర్యంగా తోటి వృత్తిలో ఆ ఇద్దరూ..

మార్చురీ వద్ద పనిచేసే తోటి వృత్తిదారులపై సాక్షి ప్రత్యేక కథనం

శవాన్ని చూడగానే కొందరు భయపడతారు.. కొందరు పక్కకి జరిగిపోతారు. ఒకవేళ తెలిసిన వారు మృతిచెందినా ఆ దేహాన్ని తాకకుండానే నివాళులర్పించివెనుతిరుగుతారు.. సాధ్యమైనంత తొందరగా 
అంత్యక్రియలూ నిర్వహిస్తారు. ఇవీ సహజంగాఎక్కువ సందర్భాల్లో తారసపడే దృశ్యాలు.. కానీ వీరు మాత్రం శవాన్ని ముట్టుకోడానికి ఏమాత్రం సంకోచించరు.. ఆ శవంతో తమకు ఎలాంటి బంధం లేకున్నా దాని దగ్గరే నిలబడతారు. వైద్యుని సూచనల మేరకు శవం శరీర భాగాలను కోస్తారు.. వైద్యులు కాకున్నా కుట్లు వేయడానికీ వెనుకాడరు.. శవాల మధ్యే ఉంటున్నా భయమనేది ఏ కోశానా వారిలో కనిపించదు.. వారెవరో కాదు.. మార్చురీ వద్ద తోటీలుగా వృత్తి నిర్వహించే వారు.. మద్యం మత్తులో విధులు నిర్వర్తిస్తారని.. మనసు లేకుండా యాంత్రికంగా చేసుకుపోతారని అనుకుంటే పొరపాటే. సాక్షి పలకరించినప్పుడు కడప మార్చురీ వద్ద తోటీలు మనసును కదిలించే  ఆసక్తికర అంశాలు వెల్లడించారు.. వీరి జీవన శైలిపై ప్రత్యేక కథనం..

సాక్షి కడప: శవాల గది (పోస్టుమార్టం రూం)..  ఇక్కడ శవాలు తప్ప ఏమీ ఉండవు.. వివిధ కారణాలతో చనిపోయిన వారి మృతదేహాలు ఇక్కడ చేరుస్తారు. అయినవారు ఎవరూ లేని డెడ్‌బాడీలను ప్రీజర్‌ బాక్సులో ఉంచుతారు. ఈ పోస్టుమార్టం రూం పేరు వింటేనే ఒకరకమైన బాధ.. ఆందోళన కలుగకమానవు. ఇక అక్కడ అడుగు పెట్టాలంటే భయంగా ఉంటుంది. అలాంటిది ఆ శవాల గది వద్ద ప్రతినిత్యం ఉంటూ.. అక్కడే తిరుగుతూ ఆ గదిలోనే పనులు చేసుకుంటూ.. విధులు నిర్వహించే తోటీల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. చెప్పలేని ఆవేదన అనుభవిస్తున్నా... వంశపారంపర్యంగా వచ్చిన వృత్తిని దైవంగా భావిస్తూ జీవనం సాగిస్తున్నారు. డాక్టర్‌ సమక్షంలో శవాన్నికోసేటప్పుడు... శరీరంలోని గుండె, కాలేయం, కిడ్నీ, లివర్, పొట్ట.. ఇలా అవయవాలను బయటికి తీస్తున్నప్పుడు.. ఎంతో వేదన అనుభవిస్తుంటామని.. కన్నీటి పర్యంతం అవుతుంటామని... అయినా విధి నిర్వహణలో ఇవన్నీ తప్పవని కడప రిమ్స్‌ పోస్టుమార్టం గదిలో పనిచేస్తున్న తోటీలు వెంకటయ్య, టి.నర్సారావు అంటున్నారు. విధి నిర్వహణలో వారు అనుభవిస్తున్న బాధ.. కష్టం.. ఎదుర్కొన్న సంఘటనలు సాక్షికి వివరించారు.

ఆ ఇద్దరూ అక్కడే..  
కడప మాసాపేటకు చెందిన వెంకటయ్య, నర్సారావులు నెల్లూరు జిల్లాకు చెందినవారైనా.. వాళ్ల పెద్దల కాలంలోనే కడపలో స్థిరపడ్డారు. ఇరువురికి వారి తండ్రులు చనిపోవడంతో తోటి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నర్సారావు 12ఏళ్ల నుంచి పోస్టుమార్గం గదిలో పనిచేస్తుండగా.. వెంకటయ్య 30 ఏళ్లుగా శవాల మధ్యన తోటిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 

ఒకరు నాలుగు వేలకు పైగా...మరొకరు 10 వేలకు పైగా...
 కడప రిమ్స్‌ మార్చురీలో తోటిగా పనిచేసే గోవింద్‌ 1991లో చనిపోయారు. దీంతో ఆయన కుమారుడైన వెంకటయ్యకు ఆ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 10 వేలకు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. వెంకటయ్యకు మేనల్లుడైన మహాదేవ్‌ కూడా ఈ పనిలో సహకరిస్తుంటాడు. 12 ఏళ్ల క్రితం నాన్న చనిపోవడంతో కుమారుడు నర్సారావుకు తోటి ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇతను కూడా పోస్టుమార్టంలో భాగంగా వైద్యుల సమక్షంలో మృతదేహం కోతకు సంబంధించిన పనులు చేస్తున్నారు. దాదాపు నాలుగు వేలకు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహణలో పాలుపంచుకున్నారు. అయితే ఇటీవల నర్సారావు కుమారుడైన రాజా కూడా అక్కడే స్వీపర్‌గా పనిచేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.

మార్చురీ రికార్డు గదిలో భోజనం చేస్తున్న తోటీలు

మొదట్లో తినేవాళ్లం  కాదు...
కడపలోని క్రిస్టియన్‌లేన్‌ సమీపంలో ఉన్న పాత రిమ్స్‌లో ఆస్పత్రి ఉన్నప్పుడు తోటిగా జాయిన్‌ అయిన మొదట్లో వృత్తి రీత్యా జీతం వస్తుందని సంతోషమనిపించినా... ఆరు నెలలపాటు చాలా అవస్థలు పడ్డాం. అది ఎంత అంటే ఒక పక్క భయం, జంకు.. మరోపక్క ఇంటికి వెళితే తిండి కూడా తినలేని పరిస్థితి. పోస్టుమార్టం గదిలో శవాలపై చేసిన సంఘటనలన్నీ గుర్తుకు వస్తుండడంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఇంటిలో అన్నం తిందామని కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొన్నా ఏదో తెలియని బాధ. అన్నం గిన్నెలో చేయి పెడితే చాలు.. పోస్టుమార్టం గదిలో చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చి ఆరు నెలల వరకు తినడమే తగ్గించాం. భోజనం ప్లేటులో చేయి పెడితే ఏదో పేగులు, గుండె, రక్తం మీద పెట్టినట్లుగా గుర్తుకు వచ్చి తినలేకపోయేవాళ్లం. తర్వాత తట్టుకోలేక అంతో ఇంతో మద్యం సేవించి తింటూ వచ్చాం. అలా ఏడాది గడిచేంత వరకు ఇబ్బందులు పడుతూ వచ్చాం.

శవాలు మీదపడేవి..
ప్రస్తుతం నూతనంగా నిర్మించిన రిమ్స్‌ ఆవరణలో విశాలమైన పోస్టుమార్టం గదితోపాటు శవాలను నిల్వ చేయడానికి ఫ్రీజర్లు ఉన్నాయి. అదే 15 ఏళ్లు వెనక్కి వెళితే.. పాత రిమ్స్‌లో ఇరుకైన గది.. పోస్టుమార్టానికి ఒక టేబుల్‌ మాత్రమే ఉండేది. దీంతో చాలా సందర్భాలలో అనేక అగచాట్లు పడేవాళ్లం. రాయచోటి ప్రాంతంలో ఎన్‌కౌంటర్లు జరిగి 10 మంది వరకు చనిపోయినప్పుడు శవాలను తీసుకొచ్చి పోస్టుమార్టం గదిలో పెట్టారు. అప్పట్లో స్థలంలేక ఒక బాడీ మీద ఒకటి వరుసగా పెట్టడం.. ఇతర ఏదైనా శవాలు వచ్చినా అన్ని వరుసగా పెట్టడంతో తిప్పలు చాలా ఎదుర్కొన్నాం. అంతేకాదు.. అనాథ శవాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా అప్పుడు బాడీ ఫ్రీజర్లు లేవు. ఒకదాని మీద ఒకటి శవాలను వరుసగా పేర్చి పెట్టేవాళ్లం. ఏదైనా చేయడానికి వెళ్లినపుడు ఒక్కసారిగా అవి వచ్చి మీద పడేవి. చిన్నగా మీద పడిన శవాలను ఒక్కొక్కటిగా పైకి చేర్చి మళ్లీ పనిచేసుకుంటూ ముందుకు పోయాం. అప్పుడు చాలా భయం అనిపించేది. కొన్ని సందర్భాల్లో శవం తెచ్చి మాకు అప్పగించడంతోపాటు ఐస్‌గడ్డ  ఇచ్చేవారు. ఐస్‌గడ్డలపై పెట్టి దానిపై బాడీని పడుకోబెడుతుండగా ఐస్‌గడ్డ కరిగి బాడీ కిందికి జరిగే సందర్భం చూసినపుడు వణికిపోయేవాళ్లం. ఎందుకంటే మృతదేహాలు కదులుతుంటే తెలియని భయం. ఇలా ఒకటేమిటి? చాలా అనుభవించాం.

శవాలు పట్టుకుంటే చేతిలోకి కండలు..  
నాకు బాగా గుర్తు. 2001 సంవత్సరంలో బుగ్గవంక వరద నీరు కడప నగరంలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది.  ఆ సమయంలో అనేకమంది ఈ నీటిలో కొట్టుకుపోయి చనిపోయారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో వంక నీటిలో చనిపోయారు. ఆ శవాల తాలూకు ఒకటి చెట్టుకు కరుచుకుంటే.. ఒకటి బ్రిడ్జి  సందున, ఇంకోటి బురదలో ఇరుక్కుపోయి బాడీలు కనిపించాయి. బుగ్గ వంక ఉధృతి తగ్గి శవాల పోస్టుమార్టం వద్దకు వెళ్లేటప్పటికి కాళ్లు, చేతులు నీలక్కపోయి, చవికిపోయి ఉన్నాయి. కనీసం బురద నుంచో.. చెట్టు నుంచో పట్టుకొని పక్కకు లాగుదామన్నా చవికిపోయిన శరీరానికి సంబంధించిన కండలు, ఎముకలు చేతిలోకి వచ్చాయి. దీంతో ఏమీ చేయలేక ఉబ్బిపోయిన శవాలను చిన్నగా పట్టుకుని బయటకు తీస్తుంటే.. వారి అవయవాలు, ఎముకలు చేతిలోకి ఊడి రావడం చూసి మాలో మాకే ఏడుపొచ్చింది. కానీ తప్పని పరిస్థితుల్లో అలాగే చేశాం.

అరిష్టమని.. ఊరిలోకి రానివ్వరు..
1800 నుంచి 2 వేల మంది గర్భవతులు చనిపోయిన ఘటనలలో నేను వారికి పోస్టుమార్టం చేసిన సందర్భాలలో చాలా బాధ అనుభవించానని తోటి వెంకటయ్య అంటున్నాడు. ‘వారి బంధువులు, కుటుంబ సభ్యుల కోరిక మేరకు గర్భవతిని అలాగే పూడ్చి పెట్టరు. సాంప్రదాయం ప్రకారం చేయాలని....కర్మకాండలు చేసే ప్రాంతానికి తమను తీసుకెళ్లి అక్కడ బిడ్డను బయటకు తీయమని కోరేవారు. వారి కోరిక మేరకు బిడ్డను వారి చేతిలో పెట్టేవాళ్లం. అప్పుడు ఆ శిశువును వాళ్లు పూడ్చిపెట్టేవాళ్లు. అయితే ముందు ఏవేవో మాటలు చెప్పి తీసుకెళ్లిన కుటుంబీకులు, బంధువులు శవం పూడ్చిన తర్వాత మమ్ములను వెళ్లమని చెప్పేవారు. అప్పుడు వచ్చిన దారిన వెళదామంటే ఊరిలో వారు ఒప్పుకోరు. కారణం ఏమిటంటే గ్రామంలోకి వస్తే అరిష్టమని అలాగే వెళ్లండంటూ అడ్డుగా నిలబడడంతోపాటు కట్టెలు పట్టుకుని ఉంటారు. ఊరి పొలిమేరల్లోకి కూడా రానివ్వరు. ఆ ఊరిలో దారులు ఎటుంటాయో కొత్తగా వచ్చిన మాకు తెలియదు.  ఇతర ప్రాంతాల మీదుగా దారి చెబితే కిలోమీటర్ల మేర నడిచి వెళ్లినా వాహనాల్లో కూడా ఎవరూ ఎక్కించుకోరు.  ఇలా ఒకసారి కాదు.. పదుల సార్లు కష్టాలు పడ్డాం’ అని ఆయన వివరించాడు.

డాక్టర్‌కు వారధి తోటి..
దేవుడికి పూజారి ఎలా వారధిలా ఉంటాడో పోస్టుమార్టం గదిలో డాక్టర్‌కు తోటి వారధిగానే ఉంటాడు. నేను ఎప్పుడైనా ఇంటిలోని కుటుంబ సభ్యులపైన కొప్పడ్డా.. కానీ తోటీలను చిన్నమాట కూడా ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే ఎవరూ చేయలేనటువంటి పనులను సమాజంలో వారు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ డాక్టర్‌ ఏం చేయాలన్న  తోటి ద్వారానే చేయిస్తారు. కొన్ని శవాలు కాలిపోయి వస్తాయి. మరికొన్ని కుళ్లిపోయి ఉంటాయి.  అలాంటి శవాన్ని కూడా పోస్టుమార్టానికి ముందు, తర్వాత నీటితో కడిగి శుభ్రం చేసిది తోటీలే. 
– డాక్టర్‌ ఆనంద్‌కుమార్, ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులు, రిమ్స్, కడప

ఇప్పుడు భయం లేదు..
ఒకప్పుడు శవమంటేనే భయçపడే పరిస్థితి. కానీ ఇప్పుడు వేల సంఖ్యలో వాటి మధ్యనే తిరుగుతూ.. ఎవరూ లేని అనాథ శవాలను రోజూ భద్రపర్చడం మొదలుకొని ఇతర పనులన్నీ అక్కడే చేస్తుంటాం. పోస్టుమార్టం గదిలో శవాల మధ్య తిరుగుతూ వైద్యుల సమక్షంలో కత్తిరింపుల కార్యక్రమంలో వేల శవాలను చూశా. ఇప్పుడు భయం అనే పరిస్థితి  లేదు. ఫీలింగ్‌ కూడా ఉండదు.  
– వెంకటయ్య, మార్చురీ తోటి, కడప

నాన్న హయాం నుంచి..
మా నాన్న హయాం నుంచి మార్చురీలో తోటి పని చేస్తున్నా. నాన్న మరణం తర్వాత నాకీ బాధ్యత వచ్చింది. నాన్న ఎప్పుడైనా ఒకసారి మార్చురీలోకి తీసుకెళ్లేవారు. తర్వాత అనారోగ్యం బారిన పడడంతో నేనే వెళ్లేవాడిని. అయితే మొదట్లో భయం, జంకుతో ఇబ్బంది పడినా తర్వాత అలవాటుగా మారింది. ఇప్పుడు ఎలాంటి జంకు లేకుండానే అక్కడే తిరుగుతుంటాం. మా కుమారుడు రాజా కూడా నాకు మార్చురీలో సహకరిస్తున్నాడు. శవం మార్చురీలోకి తీసుకు రావడం దగ్గరి నుంచి పోస్టుమార్టం అనంతరం అప్పగించే వరకు అన్ని పనులు చేసి పంపిస్తాం. శవాల మధ్యనే తిరుగుతుంటాం. శవాలే మాకు ఆత్మ బంధువులు.
– నర్సారావు, మార్చురీ తోటి, కడప

మరిన్ని వార్తలు