థాంక్యూ సోమచ్‌ కమిషనర్‌: తేజశ్వి యాదవ్‌

1 Apr, 2020 11:28 IST|Sakshi

సృజనకు కృతజ్ఞతలు తెలిపిన బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని వివిధ హోటల్స్‌లో చిక్కుకున్న బిహార్‌కి చెందిన ఇంటర్‌ విద్యార్థులను సురక్షితంగా కళాశాల హాస్టల్స్‌కి పంపించినందుకు జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజనకు బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఓ ప్రైవేట్‌ కళాశాలలలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాలేజీ హాస్టల్‌ నుంచి బయలుదేరి బిహార్‌ రాలేక నగరంలోని పలు హోటల్స్‌లో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

దీంతో బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌ ట్విట్టర్‌ ద్వారా కమిషనర్‌ సృజనకి విషయాన్ని తెలియజేశారు. కమిషనర్‌ వెంటనే స్పందించి నగరంలోని హోటల్స్‌లో జల్లెడపట్టగా 17 మంది విద్యార్థుల ఆచూకీ గుర్తించి వైద్య పరీక్షల అనంతరం కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి తిరిగి హాస్టల్‌కి పంపించారు. ఈ విషయాన్ని తేజశ్వికి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. దీంతో కమిషనర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆయన ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు