పెళ్లింట విషాదం

19 May, 2017 02:58 IST|Sakshi

దేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
కంటైనర్‌ లారీని ఢీకొన్న పెళ్లి కారు
గుంటూరు జిల్లా గూడపాడువాసి మృతి


పశ్చిమ గోదావరి జిల్లా : గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి కరుటూరి ఫంక్షన్‌ హాల్స్‌ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి మృతిచెందగా వధూవరులతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా గూడపాడు గ్రామానికి చెందిన పెళ్లి బృందం వివాహం అనంతరం అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో దేవరపల్లి వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోగా కారు అదుపుతప్పి కంటైనర్‌ లారీని ఢీకొట్టింది.

 దీంతో లారీ బోల్తా పడి పొగాకు బేళ్ల ట్రాక్టర్‌పై వాలింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా కారు నడుపుతున్న పెళ్లి కుమారుడు చిన్నాన్న జి.నారాయణ (46) తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నారాయణ మృతిచెందాడు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. కారు వేగానికి బెలూన్స్‌ పగిలిపోయాయి. ఎస్సై పి.వాసు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు