జాతీయ రహదారి రక్తమోడింది. నక్కపల్లి మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపక్కన పశువులను మేపుకొంటున్న ఇద్దరు దుర్మరణం పాలవగా, పెళ్లిసంబంధానికి వెళ్తున్నవారు, నిశితార్థానాకి వెళుతున్న వారు, ఆటోలో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు.
నక్కపల్లి: అడ్డురోడ్డు నుంచి తుని వెళ్తున్న ఆటోను సారిపల్లిపాలెం జంక్షన్ వద్ద వెనుకనుంచి వస్తున్న కారు... లారీని తప్పించబోయి ఢీకొంది. ఈ ఘటనలో ఆటో అదపు తప్పి పక్కనే పొలాల్లో పశువులను మేపుతున్న సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన కిల్లాడ అప్పలనర్స(45) కిల్లాడ రమణ(30) పైకి దూసుకుపోయింది. వారి తలకు బలమైన గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఇదే ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆటోడ్రైవర్ చిట్టుమూరి లోవరాజు, ప్రయాణికులు వెదుళ్లపాలెంకు చెందిన అమ్మలు, రాజయ్యపేటకు చెందిన పిక్కి కాసులు, వై.కాసులమ్మ, చందనాడకు చెందిన నాగమణి, అడ్డురోడ్డులకు చెందిన జ్యోతి ఉన్నారు. వీరిని నక్కపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పెళ్లి సంబంధానికి వెళ్తూ.....
ఉద్దండపురం సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన కణితి సత్యనారాయణ కుటుంబం రాంబిల్లి సమీపంలోఉన్న లాలంకోడూరుకు పెళ్లి సంబంధం కోసం బయలు దేరింది. ఉద్దండపురం సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి పంట కాలువలో బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ , అతని భార్య కనకలక్ష్మి, కుమారుడు గణేష్, బంధువులు కోమ్మొజు సత్యనారాయణ ఇతని భార్య వరలక్ష్మి, ముత్తిత్తి అప్పలాచారి, రోహిత్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేనప్పటికీ గాయాలు తీవ్రంగా తగిలాయి. నక్కపల్లి ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలాలకు వెళ్లి పరిశీలించారు. కేసు నమెదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. నక్కపల్లి ఆస్పత్రిలో క్ష తగాత్రుల బంధువులను పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఆస్పత్రి అభివృద్ధికమిటీ చైర్మన్ కొప్పిశెట్టి వెంకటేష్లు పరామర్శించారు. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అవసరమైతే కేజీహెచ్కు రిఫర్చేయాలని సూచించారు.