కర్నూలు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అమకతాడు టోల్ప్లాజా వద్ద విరుచుకుపడ్డారు.కారుపై రాళ్లతో దాడిచేసి, కత్తులతో బెదిరించి 12 తులాల బంగారం, రూ. 25 వేల నగదు తీసుకుని పారిపోయారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వాహనదారులపై దోపిడీ దొంగలు బీభత్సానికి పాల్పడ్డారు. బెంగళూరు నుంచి వస్తున్న వాహనాన్ని కృష్ణగిరి మండలం అమకతాడు టోల్ ప్లాజా దాటిన తర్వాత వాహనాన్ని దొంగలు దోచుకున్నారు. ముఖాలు కనపడకుండా మాస్కులు వేసుకుని, కత్తులతో భయపెట్టారు.
వాహనంలో ఉన్న తల్లీ కొడుకులు దొంగల భయంతో ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాధితులు కర్ణాటకకు చెందినవారు. కర్నూలులో జరుగుతున్న శుభకార్యానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. టోల్ప్లాజాకు దూరంగా ఈ సంఘటన జరగడంతో సీసీ కెమెరాలకు కూడా ఎలాంటి ఆధారాలు అందలేదు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ కర్ణాటక వాసిని తీవ్రంగా కత్తులతో గాయపరిచి అతడివద్ద ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులు తీసేసుకున్నారు. తరచు ఈ రహదారిపై ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా, పోలీసు నిఘా మాత్రం సరిగా లేదని విమర్శలు వస్తున్నాయి.