రొట్టెల పండుగకు రెడీ అయిన దర్గాలు

10 Sep, 2019 10:23 IST|Sakshi
సాతో షహీద్‌ దర్గా

ముస్తాబవుతున్న సాతో షహీద్‌ దర్గా
కొడవలూరు: మండలంలోని గండవరం సాతో షహీద్‌ దర్గా రొట్టెల పండగకు ముస్తాబవుతోంది. ఇక్కడ మొహర్రం నెల 13వ రోజున రొట్టెల పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాతో షహీద్‌ దర్గా ఆవిర్భావానికి ఒక చరిత్ర ఉందని ముస్లిం పెద్లు చెబుతున్నారు. సుమారు 4 వందల సంవత్సరాల క్రితం మత ప్రచారం కోసం 12 మంది ముస్లిం మత ప్రవక్తలు ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ జరిగిన పవిత్రయుద్ధంలో ఏడుగురు ప్రవక్తల తలలు ఈ ప్రాంతంలో పడ్డాయని చెబుతుంటారు. ప్రవక్తల మొండెలు మాత్రం నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద పడ్డాయని అందువల్లే అక్కడ 12 సమాధులతో బారా షహీద్‌ దర్గా ఆవిర్భవించగా, ఏడు తలలు పడిన చోట సాతో షహీద్‌ దర్గా నిర్మాణం జరిగిందని నానుడి ఉంది.

ఇక్కడి దర్గాలోని ఏడు సమాధులు కూడా మత ప్రవక్తల తలలకు చిహ్నాలేనన్నది ముస్లిం భక్తుల విశ్వాసం. వీరిని మొహరం నెల పదో రోజున హతమార్చినందున ఆ రోజున బారాహహీద్‌ దర్గాలో రొట్టెల పండగ జరుగుతుందని, ఆ రోజుకు మూడో రోజైన జియారత్‌ (చిన్న కర్మ) రోజున సాతోషహీద్‌ దర్గాలో రొట్టెల పండగ నిర్వహించడం జరగడం ఆనవాయితీ. బారాషహీద్‌ దర్గాకు వచ్చిన భక్తుల్లో చాలా మంది ఇక్కడకూ వచ్చి రొట్టెలు పట్టుకుంటారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారితో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వచ్చి రొట్టెలు పట్టుకుంటారు. నెల్లూరు నుంచి కావలి వైపు వచ్చే బస్సుల్లో జాతీయ రహదారిపై గండవరం క్రాస్‌ రోడ్డులో దిగి ఆటోల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. నెల్లూరు నుంచి ఇక్కడికి 15 కిలో మీటర్లు ఉంటుంది.

హిందు, ముస్లిం ఆరాధ్య క్షేత్రం
అనుమసముద్రంపేట: దక్షిణ భారతదేశంలో మత సామరస్యానికి ప్రతీకగా హిందు, ముస్లింల ఆరాధ్య క్షేత్రంగా  ఏఎస్‌పేట దర్గా విరాజిల్లుతుంది. 1747–1750 హిజ్రి శకం మధ్య కాలంలో 1161–1164లో హజరత్‌ నాయబ్‌ రసూల్‌ రహమతాబాద్‌లో ఆ గ్రామాన్ని నిర్మించారని, వారి కాలంలో నిర్మించిన కట్టడాలు చెబుతున్నాయి. ముస్లింల ఆరాధ్యదైవం అల్‌ హజ్‌ హజరత్‌ సయ్యద్‌ ఖాజారంతుల్లా ఖాజ హలాం నక్షబంద్, ఖుర్షీద్‌ బేగం పుణ్యదంపతులకు జన్మించారు. నక్షబంద్‌ పరమ సాత్వికుడు. అత్యంత దైవభక్తి గలవాడు. ఇరాన్‌ దేశం నుంచి భారతదేశానికి వచ్చి బీజాపూర్‌లోని బెల్గాంలో నివాసం ఏర్పరుచుకున్నారు.

అక్కడే నాయబ్‌ రసూల్‌ జన్మించారు. చిన్నతనం నుంచి వినయ విధేయతలతో సత్పవర్తనతో మెలిగేవారు. నాయబ్‌ రసూల్‌ తల్లి చిన్నతనంలో మరణించడంతో సవతి తల్లి ప్రేమకు నోచుకోక తండ్రి అనుమతితో ఏడేళ్ల వయస్సులోనే పవిత్ర గ్రంధం ఖురాన్‌ పఠనం పూర్తి చేసి లోకజ్ఞానం సంపాదించారు. అనంతరం దేశాటనకు బయలుదేరి మక్కా మసీదును సందర్శించారు. అక్కడ రసూల్‌  గురువుల ఆశీర్వాదం పొందారు. తర్వాత కర్నూలు జిల్లా నంధ్యాలకు చేరుకుని కొంత కాలం అక్కడ నివాసముండి తల్లి మరణానంతరం కర్నూలు నవాబు వద్ద సిపాయిగా ఉద్యోగంలో చేరారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఘోర కరువు రావడంతో ప్రజలు తీవ్ర వేదనకు గురవుతుండడంతో నాయబ్‌ రసూల్‌ తన గురువుల ఆశీర్వాద బలంతో వర్షాలు కురిపించారని చరిత్ర చెబుతుంది.

నాయబ్‌ రసూల్‌ మహిమలను గుర్తించిన కర్నూలు నవాబు తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. అనంతరం నెల్లూరు జిల్లా ఉదయగిరికి చేరుకున్న ఆయన 1762లో ప్రస్తుత దర్గా ఉన్న ప్రాంతం అనుమసముద్రంపేటకు వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకున్నాడు. ఆయన తన బోధనలు, మహిమలతో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుని కీర్తి గడించాడు. దర్గాకు వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా రహమతాబాద్‌లోని దర్గా ప్రాంతంలో కోనేటిని నిర్మించారు. క్రీస్తు శకం 1780లో ఖాజానాయబ్‌ రసూల్‌ మరణించడంతో ఆయన సతీమణి హబీబాఖాతూన్‌ (దొరసానమ్మ) దర్గా నిర్మించారు.దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు.

దర్గాకు చేరేందుకు మార్గాలు
హజరత్‌ నాయబ్‌రసూల్, దొరసానమ్మ దర్గాకు చేరాలంటే నెల్లూరు రైల్వేస్టేషన్‌ లేదా బస్టాండ్‌ నుంచి ఏఎస్‌పేటకు బస్సు వసతి ఉంది. బుచ్చి, సంగం, హసనాపురం మార్గాల మీదుగా చేరవచ్చు. నెల్లూరు నుంచి 55 కిలోమీటర్ల దూరం దర్గాకు చేరవచ్చు. నెల్లూరు నుంచి ఆత్మకూరుకు చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుపాళెం మీదుగా దర్గాకు చేరుకోవచ్చు. 13 కిలో మీటర్ల దూరం ఉంటుంది.

మత సామరస్యానికి ప్రతీక కసుమూరు దర్గా


వెంకటాచలం: మత సామరస్యానికి ప్రతీకగా కసుమూరు మస్తాన్‌ వలీ (హజరత్‌ సయ్యద్‌ కరీముల్లా షా ఖాద్రి ఉరఫ్‌ కాలేషా పీర్‌ మస్తాన్‌ వలీ) దర్గా విరాజిల్లుతోంది. హిందూ, ముస్లింలు ఆరాధ్య దైవంగా భావించే మస్తానవలీ దర్గా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగా గుర్తింపు పొందింది. దేశ నలుమూలల నుంచే కాక  విదేశాల నుంచి భక్తులు దర్గాకు హాజరవుతారు. నెల్లూరు నగరంలోని బారాషహీద్‌ దర్గా వద్ద మంగళవారం నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుండటంతో కసుమూరు దర్గాకు భక్తుల తాకిడి పెరుగుతోంది.

రొట్టెల పండగ నుంచి కసుమూరుకు.. 
బారాషహీద్‌ వద్ద రొట్టెల పండగకు వచ్చే భక్తులు కసుమూరు మస్తాన్‌వలీ దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నెల్లూరు నుంచి కసుమూరు దర్గాకు చేరుకునేందుకు భక్తులు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి నేరుగా కసుమూరు బస్సులు నడుపుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు కసుమూరుకు అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు నగరం నుంచి కసుమూరుకు 25 కిలో మీటర్ల దూరం ఉంది. ప్రైవేట్‌ వాహనాల్లో వచ్చే భక్తులు బారాషహీద్‌ దర్గా నుంచి పొదలకూరు రోడ్డు మీదుగా పాలిచెర్లపాడు అడ్డరోడ్డు నుంచి కసుమూరుకు చేరుకోవచ్చు. బారాషహీద్‌ దర్గా నుంచి అయ్యప్పగుడి, వెంకటాచలం మీదుగా కసుమూరుకు చేరుకోవచ్చు. దీంతో కసుమూరులో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి 
నెల్లూరు బారాషహీద్‌ దర్గా వద్ద రొట్టెల పండగకు వచ్చే భక్తులంతా వేల సంఖ్యలో కసుమూరు దర్గాను దర్శించుకోనుండటంతో వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంపీడీఓ సరళ  కసుమూరులో భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రణాళికలు తయారు చేశారు. తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.

చిల్లకూరులో దో షహీద్‌ దర్గా..


చిల్లకూరు: నెల్లూరులోని బారాషహీద్‌ దర్గాకు అనుబంధంగా అంతటి ప్రాముఖ్యం ఉన్న చిల్లకూరులోని దో షహీద్‌ దర్గాలో ఈ నెల 12న రొట్టెల పండగ నిర్వహణకు ముస్తాబు చేస్తున్నారు. కొడవలూరు మండలం గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో సయ్యద్‌ అహ్మద్‌ షా, సయ్యద్‌ మహ్మాద్‌ షా అనే వీరుల తలలు తెగి అక్కడ నుంచి గుర్రాలపై మొండాలు ఇక్కడికి వచ్చి పడి పోవడంతో చిల్ల కూరు ముఖ ద్వారంలో ఉన్న దో షహీద్‌ దర్గాను వందల ఏళ్ల క్రితం నిర్మించారని ప్రతీతి. బొబ్బిలికి చెందిన ఒక మహారాణి ఈ మార్గంలో చెన్నైకు పయనిస్తూ ఇక్కడ విశ్రమించడంతో ఆమెకు కలలో దోషహీద్‌లు కనిపించాయి.

అవి దర్గాను అభివృద్ధి చేయాలని చెప్పడంతో వారు సహకారంతో అప్పటి నుంచి ఇక్కడ నెల్లూరులో రొట్టెల పండగ జరిగిన మూడో రోజు చిల్లకూరులో రొట్టెల పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 12న రొట్టెల పండగ, 25వ తేదీ గంధోత్సవం నిర్వహిస్తున్నట్లు దర్గా ముతవల్లి జుబేర్‌బాషా తెలిపారు. నెల్లూరు బారాషహీద్‌ దర్గాను దర్శించుకున్న భక్తులు దో షహీద్‌ దర్గాను దర్శించుకోవాలంటే బస్సులో గూడూరు వరకు వచ్చి అక్కడ నుంచి ఆటోలో రావచ్చు. ప్రత్యేక వాహనాల్లో వచ్చే వారైతే నేరుగా జాతీయ రహదారిలోని గూడూరు సర్కిల్‌ వరకు వచ్చి అక్కడ నుంచి ఒక కి.మీ. దూరంలోని దర్గా వద్దకు చేరుకోవచ్చు .

వేనాడులో మహిమాన్విత షావలీ దర్గా


తడ: తడ మండలం వేనాడులోని షేక్‌ దావూద్‌ షావలీ అల్లా మహిమాన్విత బాబా దర్గాగా ప్రసిద్ధి చెందారు. నెల్లూరులో జరిగే రొట్టెల పండగ హాజరయ్యే భక్తులు చాలా మంది వేనాడు దర్గాను కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి నెల్లూరు వెళ్లే భక్తులు కొంత మంది తొలుత వేనాడు బాబా దర్శనం చేసుకుని వెళుతుండగా, మరి కొందరు నెల్లూరులో పండగ అనంతరం వేనాడుకు వస్తున్నారు. దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దర్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 144 అడుగుల పొడవుతో ఆసియాల్లోనే అత్యంత పొడవైన దర్గాగా వేనాడు దర్గాకు పేరుంది.

తీరని కోర్కెలు ఉన్నవారు, కోరికలు తీరిన వారు అమావాస్య రోజున బాబా దర్గా వద్ద నిద్ర చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం అమావాస్య రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చి నిద్ర చేస్తారు. దర్గా వద్ద ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా గంధోత్సవం నిర్వహిస్తారు. నెల్లూరు నుంచి సూళ్లూరుపేట వచ్చి అక్కడ నుంచి శ్రీహరికోట మార్గంలో 17 కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత అటకానితిప్ప వద్ద నుంచి కుడి వైపునకు గ్రావెల్‌రోడ్డు వెళ్తుంది. ఆ మార్గంలో 11 కిలో మీటర్లు ప్రయాణిస్తే దర్గాకి చేరుకోవచ్చు. సూళ్లూరుపేట నుంచి నిర్ణీత వేళల్లో ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా జీపులు, ఆటోల సౌకర్యం ఉంది.

మరిన్ని వార్తలు