-

గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు రూ.277 కోట్లు

6 Jun, 2020 03:45 IST|Sakshi

తాగునీటి పథకాల నిర్వహణకు రూ.100 కోట్లు విడుదల

మంత్రి పెద్దిరెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది మంచినీటి ఇబ్బందుల నివారణకు ఇప్పటికే రూ.277.68 కోట్లు విడుదల చేసినట్టు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్ర నీటి ఎద్దడి ఉండే గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రెండు విడతల్లో రూ.177 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు మరో రూ.100 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు.

రక్షిత మంచినీటి పథకాల నిర్వహణతో పాటు అవసరమైన చోట చిన్న మరమ్మతులు చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా ఈ ఏడాది వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాల్సిన గ్రామాల సంఖ్య తగ్గిందని మంత్రి వివరించారు. గత ఏడాది వేసవిలో 5,175 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి వస్తే, ఈ ఏడాది వేసవిలో 3,314 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. తీవ్ర నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో పశువుల అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు. 

మరిన్ని వార్తలు