ఏటీఎం కార్డు మార్చి రూ.30వేలు డ్రా

5 Jan, 2014 04:07 IST|Sakshi

 కోరుట్ల రూరల్, న్యూస్‌లైన్ : పట్టణంలోని ఎస్‌బీహెచ్ ఎటీఎం వద్ద ఓ వ్యక్తి నుంచి సినీ ఫక్కీలో ఏటీఎం కార్డు చోరీచేసి మరో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. మెట్‌పెల్లికి చెందిన బొమ్మనవేని ఎల్లయ్య తన సోదరుడు గంగాధర్‌తో కలిసి డెకరేషన్ సామగ్రి కొనుగోలు చేసేందుకు కోరుట్లకు వచ్చారు. గంగాధర్‌కు చెందిన ఎస్‌బీఐ ఏటీఎం కార్డును ఎల్లయ్యకు ఇచ్చాడు. ఎల్లయ్యకు డబ్బులు డ్రా చేయడం తెలియకపోవడంతో మరో ఏటీఎంలో ఉన్న ఓ యువకుడికి ఇచ్చాడు.
 
 రూ.5వేలు డ్రా చేయాలనగా.. అకౌంట్‌లో డబ్బులు లేవంటూ కార్డు ఇచ్చాడు. నిజమని నమ్మిన ఎల్లయ్య కార్డును తీసుకెళ్లి గంగాధర్‌కు ఇచ్చేలోపే రూ.30వేలు డ్రా అయినట్లు సెల్‌కు మెసేజ్ వచ్చింది. గంగాధర్‌కు ఇచ్చిన కార్డుపై మిర్యాలగూడకు చెందిన మేడి కవిత అని రాసి ఉంది. లబోదిబోమంటూ బాధితులు అకౌంట్‌ను లాక్ చేయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు