-

బాబు బినామీకి రూ.460 కోట్లు!

9 Mar, 2019 04:31 IST|Sakshi

గాలేరుృనగరి సుజల స్రవంతి రెండో దశ టెండర్లలో సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగం

పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించి.. ఒప్పందాలను రద్దు చేయించిన వైనం

మిగిలిన పనుల అంచనా వ్యయం భారీగా పెంపు

బినామీ సీఎం రమేశ్‌ సంస్థకే పనులు దక్కేలా టెండర్‌ నోటిఫికేషన్‌లు జారీ 

ఇప్పటికే రూ.406.73 కోట్ల పనులు అప్పగింత 

మరో రూ.343.52 కోట్ల పనులు కట్టబెట్టేందుకు సిద్ధం

సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడే అందినంత దోచుకోవాలన్న కొత్త నీతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టించారు. తన బినామీ, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ సంస్థకు ఇప్పటికే ఎన్నోసార్లు లబ్ధి చేకూర్చిన చంద్రబాబు గాలేరు-నగరి సుజల స్రవంతి రెండో దశ పనులు సైతం అదే సంస్థకు అధిక ధరలకు దక్కేలా తన అధికార బలం ఉపయోగించారు. ఈ వ్యవహారంలో సీఎం రమేశ్‌కు ఉత్తినే రూ.460 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇందులో మెజారిటీ వాటా కమీషన్ల రూపంలో ముఖ్యమంత్రి జేబులోకి వెళ్లనుంది. చంద్రబాబు అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి ఇదొక నిదర్శనమని అధికార వర్గాలు చెబుతున్నాయి. గాలేరుృనగరి సుజల స్రవంతి పథకం రెండో దశలో మొదటి ప్యాకేజీలో రూ.69.89 కోట్ల  పనులు మాత్రమే మిగిలాయి. రెండో ప్యాకేజీలో రూ.110 కోట్ల విలువైన పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను బెదిరించి, ఒప్పందాన్ని రద్దు చేసుకునేలా(ప్రీృక్లోజర్‌) ప్రభుత్వానికి దరఖాస్తు చేయించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు జల వనరుల శాఖ అధికారులు ఆమోదించారు. తర్వాత 2018ృ19 స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) ఆధారంగా మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. 

బినామీపై అంతులేని ప్రేమ 
తన బినామీ సీఎం రమేశ్‌ సంస్థ రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌కే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి, టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దాంతో మొదటి ప్యాకేజీ పనులకు రూ.391.31 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 11న ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)ృఓపెన్‌ పద్ధతిలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఫిబ్రవరి 25న టెక్నికల్‌ బిడ్‌ తెరిచారు. రిత్విక్‌ ప్రాజెక్టŠస్, ఎన్‌సీసీ, ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలు షెడ్యూళ్లను దాఖలు చేశాయి. ఇందులో తస్మదీయులకు చెందిన ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలకు అర్హతలు ఉన్నా.. ఆ సంస్థలు దాఖలు చేసిన షెడ్యూళ్లపై అనర్హత వేటు వేశారు. కోటరీలోని ఎన్‌సీసీ.. రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ కంటే ఎక్కువ ధరకు కోట్‌ చేస్తూ షెడ్యూల్‌ దాఖలు చేసేలా చక్రం తిప్పారు. అన్ని అర్హతలు ఉన్నా అనర్హత వేటు వేయడంపై ఇతర సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. కేసు విచారణలో ఉండగానే సీఎం చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు బుధవారం ఫైనాన్స్‌ బిడ్‌ తెరిచారు.

సీఎం రమేశ్‌ సంస్థ 3.99 శాతం ఎక్సెస్‌(రూ.406.73 కోట్లు), ఎన్‌సీసీ 4.65 శాతం ఎక్సెస్‌(రూ.409.50 కోట్లు) కోట్‌ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసినట్లు వెల్లడైంది. వీటిని గురువారం కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ) పరిశీలనకు పంపారు. అదేరోజు సమావేశమైన సీవోటీ.. సీఎం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ను ఆమోదించింది. సాధారణ పరిస్థితుల్లో టెండర్‌ నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువకు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చేవారు. అప్పుడు సర్కార్‌కు రూ.54.74 కోట్ల మేర మిగిలేది. అంచనా వ్యయాన్ని రూ.321.42 కోట్లు పెంచడం వల్ల కాంట్రాక్టర్‌కు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారు. ఈ వ్యవహారంలో సీఎం రమేశ్‌కు కనీసం రూ.250 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని అధికారవర్గాలే చెబుతున్నాయి. 

తస్మదీయ కంపెనీలపై అనర్హత వేటు 
రెండో ప్యాకేజీ పనులకు రూ.343.52 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 27న ఎల్‌ఎస్‌ృఓపెన్‌ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ టెండర్‌లో శుక్రవారం టెక్నికల్‌ బిడ్‌ను తెరిచారు. ఇందులోనూ యథావిధిగా తస్మదీయులకు చెందిన ఎమ్మార్కేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు అన్ని అర్హతలు ఉన్నా అనర్హత వేటు వేయించారు. శనివారం ప్రైస్‌ బిడ్‌ తెరిచి.. దాదాపు 4.76 శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేసిన సీఎం రమేష్‌ సంస్థ రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌కు ఈ పనులను సైతం అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.50.70 కోట్ల మేర భారం పడుతుంది. అంచనా వ్యయాన్ని రూ.233.52 కోట్ల మేర పెంచడం ద్వారా సీఎం రమేశ్‌ సంస్థకు భారీ ఎత్తున ప్రయోజనం చేకూర్చారు. ఈ వ్యవహారంలో సీఎం రమేశ్‌కు రూ.210 కోట్ల మేర ప్రయోజనం చేకూరనున్నట్లు జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు చెప్పారు. అంటే రెండు ప్యాకేజీల్లో కలిపి చంద్రబాబు బినామీకి ఏకంగా రూ.460 కోట్ల లాభ అన్నమాట!   

మరిన్ని వార్తలు