మహిళలు సీరియల్స్‌ చూసి ఆనందించాలి: నారా లోకేష్‌

20 Jun, 2018 11:04 IST|Sakshi

24 గంటలు కరెంట్‌ ఇస్తున్నాం  

నియోజకవర్గ అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయిస్తా.. 

చీరాల పర్యటనలో నారా లోకేష్‌

చీరాల: మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి లోకేష్‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అభ్యర్థన మేరకు రూ.25 కోట్ల నిధులతో సీసీ రోడ్లు నిర్మానానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ నియోజకవర్గంలో 225 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాలు జరగలేదని అందులో చీరాల మండలానికి రూ.10 కోట్లు, వేటపాలెం మండలానికి రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. 

దీనిపై మంత్రి స్పందిస్తూ తన పర్యటన ముగింపునకు కొద్దిరోజుల క్రితమే చీరాల నియోజకవర్గానికి బీటీ రోడ్లు నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించానని, కొద్ది రోజుల్లో రూ.15 కోట్లు కేటాయించి 225 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తానని లోకేష్‌ హామీ ఇచ్చారు. రామాపురంలో జరిగిన సభలో లోకేష్‌ మాట్లాడుతూ మత్య్సకారుల సంక్షేమానికే టీడీపీ ప్రభుత్వం పాటు పడుతోందని, మత్య్సకారులందరికీ డీజిల్‌ సబ్సిడీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 150 మందికి ఇళ్ల స్థలాలు, సీసీ రోడ్లు, ముఖద్వారం ఏర్పాటు చేస్తానన్నారు. 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నామని అందుకే సీరియల్స్‌ చూసి ఆనందంగా ఉండాలంటూ మహిళలకు సూచించారు. 2020 నాటికి రాష్ట్ర అబభివృద్ధిలో అగ్రభాగాన నిలిపి అంగన్‌ వాడీ భవనాలు, ఎల్‌ఈడీ భవనాలు, సీసీ రోడ్లు నిర్మించి ఇస్తామన్నారు.  దిక్కులేని రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద దిక్కు అని సభలో లోకేష్‌ వాఖ్యానించారు. రైతు రుణమాఫీకి నియోజకవర్గానికి రూ.1.30 కోట్లు విడుదల చేశామన్నారు.

హార్బర్‌ రాదు..
‘కేంద్రం, రాష్ట్రాన్ని మోసం చేసింది..రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా వేధించింది. మత్య్సకారుల చిరకాల వాంఛ అయిన హార్బర్‌ నిర్మాణానికి నిధులు ఇవ్వదు. నీతి ఆయోగ్‌ పథకం ఒట్టిదే’ అని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వేటపాలెం మండలం రామాపురంలో జరిగిన మత్య్సకారుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సీఎం 11 గంటలు కష్టపడుతున్నారని, మత్య్సకారుల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందన్నారు. మత్య్సకారులకు ముఖ్యమైన హార్బర్‌ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ఆమంచి అడుగగా మంత్రి ఆదినారాయణ మాత్రం కేంద్రం హార్బర్‌ నిర్మాణానికి నిధులు ఇవ్వదు....సాగర్‌ మాల అంతా బూటకం అని వాఖ్యానించారు. 

డబ్బులు, పెట్రోల్‌ ఫ్రీ
మొదటిసారి నియోజకవర్గ పర్యటనకు చీరాలకు వచ్చిన మంత్రి లోకేష్‌ పర్యటనలో తన ఓటు బ్యాంకును చూపించుకోవడానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధి గ్రామాల నుంచి జన సమీకరణ చేశారు. ప్రతి గ్రామానికి 4 నుంచి 6 ప్రైవేటు స్కూళ్ల బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు  బైక్‌ ర్యాలీతో స్వాగతం పలికించారు. టూవీలర్‌కు 2 లీటర్ల పెట్రోల్, డబ్బులు, పార్ట స్టికర్లు పంపిణీ చేశారు.           

ఆమంచి వర్సెస్‌ కలెక్టర్‌
చీరాల: మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభించాల్సిన కొత్తపేట జెడ్పీ హైస్కూల్‌ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆమంచి మధ్య వాగ్వాదం జరిగింది. హైస్కూల్‌ నిర్మించిన స్థల వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంత్రి లోకేష్‌ ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లారు. అసలు కొత్తపేట హైస్కూల్‌ ప్రారంభానికే వచ్చినప్పటికీ కలెక్టర్‌ సూచనల మేరకు మంత్రి లోకేష్‌ వెనుతిరిగారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కొత్తపేటలో హైస్కూల్‌ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కలెక్టర్, ఇతర అధికారుల సహకారంతో రూ.2.20 కోట్ల అంచనాలతో కేవలం 50 రోజుల్లోనే నూతన భవంతులు నిర్మించారు.

 ఈ స్కూల్లో బస్సు సౌకర్యం, విద్యార్థులకు సైకిళ్లు, మధ్యాహ్న భోజనం, డైనింగ్‌ హాల్, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా స్కూల్‌ నిర్మాణం చేశారు. అయితే కొత్తపేట హైస్కూల్‌ నిర్మించిన స్థలం ది ఐఎల్‌టీడీ కోపరేటివ్‌ సొసైటీకి చెందింది. అందులో కార్మికులు కొందరికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కాగా ఇదే స్థలంలో హైస్కూల్‌ నిర్మాణం చేపట్టడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో కేసు నడుస్తుండగా స్టే కూడా ఇచ్చారు. 

ఈ పరిస్థితుల్లో చీరాల పర్యటనకు వచ్చిన నారా లోకేష్‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఇంటికి అల్పాహారానికి వెళ్లారు. లోకేష్‌తో పాటుగా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులున్నారు. ఇక్కడ సమస్యను కలెక్టర్‌ వినయ్‌చంద్‌ లోకేష్‌కు వివరించారు. దీనిపై ఆగ్రహం చెందిన ఆమంచి.. కలెక్టర్‌తో విభేందించారు.  ఉదయం 8 గంటలకే మంత్రి లోకేష్‌తో స్కూల్‌ విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖాముఖి అన్నారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు పాఠశాల ప్రారంభం కానీ, ముఖాముఖి లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. 

>
మరిన్ని వార్తలు