300 వాహనాలను టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండానే డెలివరీ చేసినట్లు బహిర్గతం
సాక్షి, అమరావతి: వరుణ్ మోటార్స్ గ్రూపు షోరూమ్ల్లో అవకతవకలు జరిగినట్లు రవాణా శాఖ తనిఖీల్లో ప్రాథమికంగా వెల్లడైంది. పలు ఫిర్యాదుల ఆధారంగా విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, విజయనగరం, శ్రీకాకుళంలోని వరుణ్ మోటార్స్ షోరూమ్ల్లో రవాణా శాఖ గురువారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. 300 వాహనాలను టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా డెలివరీ చేసినట్లు ఈ తనిఖీల్లో వెల్లడైంది. అలాగే రవాణా శాఖకు ఎటువంటి సమాచారం లేకుండా చాలాచోట్ల సబ్ డీలర్లతో వాహనాల విక్రయాలు చేస్తున్నట్లు తేలింది. అక్రమాలు బహిర్గతమైన నేపథ్యంలో వరుణ్ మోటార్స్ గ్రూప్స్ షోరూమ్ల్లో వాహనాల విక్రయాలు జరగకుండా లాగిన్ను రవాణా శాఖ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. మరింత లోతుగా విచారణ చేశాక అక్రమాలపై మరిన్ని చర్యలను తీసుకోవాలని నిర్ణయించింది. (చదవండి: లలితా రైస్ మిల్స్లో ఐటీ దాడులు)