బస్సు నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి

21 Nov, 2015 20:21 IST|Sakshi

రాప్తాడు (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మిరెడ్డిపల్లె మలుపులో బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అంత బాధలోనూ బస్సును పక్కనున్న గోతిలోకి మెల్లగా దింపి ఆపాడు. క్షణాల్లో కూర్చున్న సీట్లోనే మృతిచెందాడు. సంఘటన జరిగినపుడు బస్సులో వంద మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కాస్త పక్కకు ఒరిగి ఆగిపోవడంతో వారందరూ క్షేమంగా కిందికి దిగారు. ఈ సంఘటన శనివారం రాత్రి 7.30 గంటలకు జరిగింది.

అనంతపురం డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు సాయంత్రం బండమీదపల్లెకు బయలుదేరింది. బొమ్మిరెడ్డిపల్లె మలుపు వద్దకు రాగానే డ్రైవర్ ముత్యాలప్పకు కళ్లు తిరిగి ఒళ్లంతా చెమట్లు పట్టాయి. గుండెనొప్పి రావడంతో బస్సును జాగ్రత్తగా ఆపి స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. గమనించిన కండక్టర్, ప్రయాణికులు వెళ్లి చూడగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. వెంటనే 108కు, పోలీసులకు సమాచారం అందించారు. 108 సిబ్బంది డ్రైవర్‌ను అనంతపురం ఆస్పత్రికి తరలిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళుతున్నారు.

>
మరిన్ని వార్తలు