ఆర్టీసీ కండక్టర్‌ నిజాయితీ

4 May, 2018 12:09 IST|Sakshi
రమణకు బ్రాస్‌లెట్‌ను అందజేస్తున్న డీఎం అరుణకుమారి 

శ్రీకాకుళం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ శ్రీకాకుళం రెండవడిపోకు చెందిన ఏపీ 30 వై 5677 నంబరు బస్సులో కొత్తూరు నుంచి శ్రీకాకుళానికి బయలుదేరిన ప్రయాణికుడు తన బంగారు బ్రాస్‌లెట్‌(రెండు తులాలు)ను బస్సులో పోగొట్టుకున్నాడు. బస్సు శ్రీకాకుళం కాంప్లెక్స్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులందరూ దిగిపోయాక కండక్టర్‌ ఒకసారి బస్సును పరిశీలించగా అందులో బ్రాస్‌లెట్‌ దొరికింది. వెంటనే బ్రాస్‌లెట్‌ను శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్‌ నంబాళ్ళ అరుణకుమారికి అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు.

వివరాల్లోకి వెళి తే...శ్రీకాకుళంనకు చెందిన పి.రమణ మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో కొత్తూరులో బస్సు ఎక్కి శ్రీకా కుళం టికెట్‌ తీసుకున్నాడు. బస్సు శ్రీకాకుళం కాంప్లెక్స్‌ చేరుకునేటప్పటికి సాయంత్రం 4.30 గంటలు అయ్యింది. బస్సు దిగే తొందరలో తన చేతికి ఉన్న బంగారు బ్రాస్‌లెట్‌ బస్సులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత కండక్టర్‌ కె.ఎస్‌.చలం బస్సును పరిశీలించగా రెండు తులాల బంగారు బ్రాస్‌ లెట్‌ దొరికింది. దానిని రెండో డిపో మేనేజర్‌ అరుణకుమారి కి కండక్టర్‌ అప్పగించారు.

రమణ ఇంటిదగ్గరకి వచ్చిన తర్వాత బ్రాస్‌లెట్‌ లేకపోవడంతో బస్సులో పడిపోయి ఉంటుందని భావించి డిపో మేనేజర్‌కు విషయం చెప్పారు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాత రమణకు బ్రాస్‌లెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ టీఐ–3 కె.ఎస్‌.రాజు, సెక్యూరిటీ హెడ్‌ గార్డు ముకుందరావు, సెక్యూరిటీ గార్డు జనార్దన్‌ డీసీ రమేష్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు