శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సేవ్ ఏపీ సభకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో బస్సులపై దాడి చేయడాన్ని ఆర్టీసీ ఈయూ, ఎన్ఎంయూ ఖండించాయి. ఈమేరకు రెండు సంఘాలు ఆదివారం వేర్వేరుగా పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రజాస్వామ్యయుతంగా, అత్యంత క్రమశిక్షణతో సభకు వచ్చిన వారిపై దాడులు చేయడాన్ని హేయమైన చర్యగా పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వాటర్ ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు బాలమునెయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశాయి.
అపోలో ఆసుపత్రికి తరలింపు
శనివారం బస్సులపై జరిగిన దాడిలో గాయపడిన సత్యనారాయణ(వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, రాజమండ్రి)ని వనస్థలిపురంలోని స్థానిక ఆసుపత్రి నుంచి ఆదివారం ఆపోలో ఆసుపత్రికి తరలించారు. దవడ ఎముక విరగడంతో పాటు పలు చోట్ల గాయాలయ్యాయి. దవడ ప్రాంతంలో శస్త్ర చికత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. ఏపీఎన్జీవో నాయకులు ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయిస్తున్నారు.