వాట్సప్‌ మెసేజ్‌ కలకలం..ఎస్‌ఐ క్షేమం

1 Mar, 2020 11:42 IST|Sakshi
రోదిస్తున్న ఎస్‌ఐ తల్లి, ఎస్‌ఐ విష్ణు నారాయణ(ఫైల్‌)

సాక్షి, కర్నూలు : వాట్సాప్‌ గ్రూపులో మెసేజ్‌ పెట్టి ఓ ఎస్‌ఐ కనిపించకుండా పోవటం కలకలం రేపింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా రుద్రారంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. కర్నూలు జిల్లాకు చెందిన విష్ణునారాయణ రుద్రవరం పీఎస్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో నిర్లక్ష్యం వహించాడనే కారణంతో అధికారులు ఆయన్ని హెడ్‌ క్వార్టర్స్‌కు పిలిపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విష్ణు నారాయణ శనివారం అర్థరాత్రి వాట్సాప్‌ గ్రూపులో  ‘‘ ఈ మెసేజ్‌ చదివే సమయానికి నేను బతకొచ్చు లేదా చనిపోవచ్చు. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు’’ అని మెసేజ్‌ పెట్టాడు.

అయితే ఈ మెసేజ్‌ చదివిన డీఎస్పీ..  విష్ణునారాయణ ఇంటికి చేరుకుని నచ్చజెప్పారు. అయినప్పటికి ఎస్‌ఐ ఈ తెల్లవారుజామున కారులో ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట​ఆరు. కాగా ఎస్‌ఐ విష్ణునారాయణ ఆదివారం మధ్యాహ్నం ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజుకు ఫోన్‌ చేసి, తాను మైదుకూరు మండలం బ్రహ్మంగారి మఠంలో ఉన్నట్లు సమాచారం అందించాడు. దీంతో అధికారులతో పాటు కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు