విజయనగరం :రాష్ట్రంలో గల ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్స్, కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ టీచింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరాం. మేమంతా రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికై ఏడేళ్లుగా పనిచేస్తున్నా రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఇవ్వడం లేదు. ఏడాదిలో పది నెలలు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు. సమస్యలు విన్న జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆయన న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది.– పి.రమణ, ఎన్.శ్రీనివాస్, జె.నారాయణరావు, తదితరులు
అరకొర పోస్టులతో డీఎస్సీ
నా పేరు మరడ లక్ష్మీదీప్తి. డీఎస్పీలో ఎస్జీటీ కోసం కోచింగ్ తీసుకుంటున్నాను. కార్పొరేట్ పాఠశాలలు ఎక్కువ కావడంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. పైగా అరకొర పోస్టులతో డీఎస్సీ ప్రకటించారు. ఎస్జీటీకి బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించడంతో మాలాంటి వారికి అన్యాయం జరుగుతోంది. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారు. కాని ఆయన వల్ల నిరుద్యోగులకు కలిగే లాభం ఏమీ లేదు.–మరడ లక్ష్మీదీపిక, పెద్ద వీధి, సాలూరు
వితంతు పింఛన్ రాలేదు..
నా భర్త కొల్ల సత్యనారాయణ చనిపోయి ఏడాదిన్నర అవుతోంది. వితంతు పింఛన్కు రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా. అయినా ఫలితం లేదు. కుమార్తెలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు. నాకు కూలి పనిచేసే ఓపిక కూడా లేదు. నా సమస్యను జగన్బాబు దృష్టికి తీసుకెళ్లాను. ఆయన ముఖ్యమంత్రి అయితే మాలాంటి వారికి న్యాయం జరుగుతుంది.– కొల్ల కుమారి
సదరం సర్టిఫికెట్ ఉన్నా..
నా భర్త పెంట సిమిడిశెట్టి దివ్యాంగుడు. ఏ పనీ చేయలేడు. వికలాంగత్వం ద్రువీకరిస్తూ సదరం వైద్యులు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. నేను కూలి చేస్తేనే ఇళ్లు గడిచేది. మీ ప్రభుత్వం వచ్చాక మాలాంటి వారికి న్యాయం చేయాలి.– పెంట ఎల్లమ్మ, కులుగుమ్మి, పార్వతీపురం మండలం