‘రైతు భరోసా’కు కసరత్తు పూర్తి : వ్యవసాయ శాఖ కమిషనర్‌

12 Oct, 2019 15:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో భాగంగా హామీ ఇచ్చిన ‘రైతు భరోసా’ పథకం అమలుకు తగిన కసరత్తును పూర్తి చేశామని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ శనివారం వెల్లడించారు. వెబ్‌ల్యాండ్‌ రికార్డు ఆధారంగా గుర్తించిన లబ్దిదారుల జాబితాను అన్ని గ్రామ పంచాయితీల్లో పొందుపరిచామని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 12500 సహాయం అందించే ఈ పథకం లబ్దిదారుల తొలి జాబితాను ఆదివారం సాయంత్రం ఖరారు చేస్తామని తెలిపారు.

అక్టోబరు 15వ తేదీన ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సహాయం అందిస్తామని, 15 తర్వాత కూడా సమస్యలున్న రైతులకు వాటి పరిష్కారం కోసం తగిన సమయం ఇవ్వాలనుకుంటున్నట్టు అరుణ్‌కుమార్‌ తెలియజేశారు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సహాయం అందించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చయినా వెనుకాడవద్దని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు కమిషనర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు