సాగర్ కాల్వల ఆధునీకరణ ఏమైంది?

24 Dec, 2014 01:43 IST|Sakshi

అసెంబ్లీలో సభ్యుల ప్రశ్న 2016లో పూర్తిచేస్తాం: మంత్రి జవాబు
 
హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణను సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, కాలువల ఆధునీకరణను త్వర గా పూర్తిచేసి భూములకు నీరందించాలని పలువురు శాసనసభ్యులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పోతుల రామారావు అడిగిన లిఖిత ప్రశ్నపై మంగళవారం శాసనసభలో చర్చ జరిగింది. రూ. 2,832.69 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన సాగ ర్‌కాల్వల ఆధునీకరణ పనులకు ప్రపంచ బ్యాంకు 48 శాతం, రాష్ట్రం 52 శాతం నిధు లు భరిస్తున్నాయని, ఇప్పటివరకు రూ. 810.94 కోట్లు వ్యయం చేశామని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు.

ఆధునీకరణ పనులను 2016 జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అయితే.. ఇన్ని నిధులు వ్యయం చేసినా ఏ కాల్వ పనీ పూర్తి కాలేదని, ప్రకాశం జిల్లాలో ఏ కాల్వకూ లైనింగ్ వేయలేదని, కాంట్రాక్టర్లు పనులను సగంలో వదిలేసి వెళ్లిపోవడం వల్ల తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోందని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కాలువ చివరి భూముల రైతుల ఇక్కట్లు పట్టించుకుని సాధ్యమైనంత త్వరగా నీరందించేలా చూడాలని స్పీకర్ కోడెల కూడా ప్రభుత్వానికి సూచించారు. ఈ నెల 27, 28 తేదీలలో కాల్వల పరిశీలనకు తనతో పాటు రావాలని మంత్రి ఉమ ఎమ్మెల్యేలను కోరారు.
 
 

మరిన్ని వార్తలు