నవశకానికి నాంది

23 Mar, 2019 12:32 IST|Sakshi
నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు

పారిశ్రామికవేత్త అయిన కనుమూరి రఘురామకృష్ణంరాజు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. వైఎస్సార్‌సీపీ నరసాపురం లోక్‌సభాస్థానం అభ్యర్థిగా ప్రజాసంక్షేమమే అజెండాగా ప్రచారం ప్రారంభించారు. సినీనటుడు నాగేంద్రబాబు పోటీలో ఉన్నా.. జనం.. జగనే తన బలమని పంచెకట్టుతో దూసుకుపోతున్నారు.  

ప్రశ్న: రాజకీయాలు, పోటీ కొత్తగా ఉన్నాయా? 
రఘురామకృష్ణంరాజు : నేను సమైక్య ఉద్యమం నుంచీ జనంతోనే ఉన్నా. పోటీచేయడం తొలిసారి. కొంత కొత్తగా ఉంది. ప్రజలతో కలసి తిరగడం, వారి కష్టసుఖాలు పంచుకోవడం మంచి అనుభూతి. మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ అనుభూతితోనే ఏమో వేల కిలోమీటర్లు అలుపెరగకుండా తిరిగారు.


ప్రశ్న: రాజకీయాల్లోకి రావాలని ఎందుకనిపించింది?  
రఘురామకృష్ణంరాజు : వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారే స్ఫూర్తి. సంక్షేమ పథకాలతో ఆయన పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అంతక్రితం ఎన్టీఆర్, ఎంజీఆర్‌ నాలో రాజకీయ ఉత్తేజం నింపారు.  


ప్రశ్న : వైఎస్సార్‌ స్ఫూర్తితోనే పంచె కడుతున్నారా?  
రఘురామకృష్ణంరాజు : అదేమీ లేదు. నేను సంప్రదాయాలను గౌరవిస్తా.  పండుగలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఇలానే వెళ్తాను. లుక్‌ కొత్తగా ఉందని అందరూ అంటున్నారు (నవ్వుతూ..) 


ప్రశ్న : కుటుంబ సభ్యులు రాజకీయాలు ఎందుకనలేదా?  
రఘుమరాకృష్ణంరాజు : లేదు. మాఇంట్లో అందరికీ ఇష్టమే. నా భార్య సహకారం ఎక్కువ.

 
ప్రశ్న : సేవకు రాజకీయాలే పరమావధా?
రఘురామకృష్ణంరాజు : కచ్చితంగా కాదు. కానీ అధికారం, ప్రభుత్వం ద్వారా చేసే సేవకు పరిధి ఎక్కువ. వ్యక్తిగతంగా అన్నీ చేయలేం.  


ప్రశ్న: నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందా? 
రఘురామకృష్ణంరాజు : ఉంది. కీలకమైన నియోజకవర్గం. వనరులున్నా.. పారిశ్రామికంగా అభివృద్ధిలేదు. రైల్వే అభివృద్ధిపైనా గత ఎంపీలు దృష్టిపెట్టలేదు. కోటిపల్లి రైల్వే ప్రాజెక్ట్‌ పెండింగ్‌లోనే ఉంది. సరిగ్గా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం రాష్ట్రానికి తలమానికమవుతుంది. 


ప్రశ్న:  నాగేంద్రబాబు పోటీ చేస్తున్నారు కదా?
రఘురామకృష్ణంరాజు:  అవేం పట్టించుకోవట్లేదు. నా పంథాలో వెళ్తున్నా. ఎన్నికల్లో గెలుపు తథ్యం. 

 

మరిన్ని వార్తలు