గ్యాంగ్‌వార్‌ : సందీప్‌ని పక్కా పథకంతోనే హత్య చేశారు

4 Jun, 2020 21:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ : పటమటలో ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్‌లో రౌడీషీటర్‌ సందీప్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సందీప్‌ భార్య తేజస్విని, తల్లి పద్మావతి సాక్షి టీవీతో ముచ్చటించారు.  సందీప్‌ భార్య తేజస్విని మాట్లాడుతూ.. ' సందీప్‌ను పక్కా పథకంతోనే హత్య చేశారు. లాండ్ సెటిల్మెంట్ గొడవకు సందీప్ కి సంబంధం లేదు. సందీప్ హత్య వెనుక ఉన్న కుట్రను పోలీసులు చేధిస్తారన్న నమ్మకం మాకు ఉంది. కాగా గొడవకు ముందు రోజే సందీప్‌ను ఫోన్‌లో బెదిరించారు. తర్వాత ఫోన్ లిప్ట్ చేయకపోవడంతోనే సందీప్ కోసం ఐరన్ షాపు దగ్గరకు పండు బ్యాచ్ వచ్చారు. ఆ సమయంలో సందీప్ లేకపోవడంతో షాపులో ఉన్న గుమస్తాపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. గొడవ పెంచటం ఇష్టం లేక పోలీసులకు పిర్యాదు చేయలేదు. నీ కుటుంబాన్ని అంతంచేస్తానని సందీప్‌కు ఫోన్ చేసి బెదిరించారు. సందీప్‌ను మాట్లాడుకుందాంరా అంటూ పడమటకు పిలిచి దారుణంగా హత్య చేశారు. సందీప్ మంచితనం, సేవాగుణం చూసి ప్రేమ వివాహం చేసుకున్నా.. సందీప్ హత్యపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి..సందీప్ మృతికి కారణమైన వారందరినీ శిక్షపడే వరకు పోరాడుతా ' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (గ్యాంగ్‌ వార్‌ : వెలుగులోకి కీలక అంశాలు)

సందీప్‌ తల్లి పద్మావతి మాట్లాడుతూ.. ' సందీప్ మరణానికి కారణమైన పండును కఠినమైన శిక్ష పడాలి. సందీప్ కాలేజి రోజులనుంచే యూత్ లీడర్ గా పని చేశాడు. అందువల్లనే మా అబ్బాయికి యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. సందీప్ వివాదాలకు వెళ్లే వాడు కాదు.. నా కొడుకు మృతికి కారణం అయిన ప్రతి ఒక్కరినీ పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా' అంటూ తెలిపారు.
(బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో పురోగతి)

మరిన్ని వార్తలు