విశాఖలో సందడి చేసిన సమంత

4 Jul, 2019 11:14 IST|Sakshi
రఘు కళాశాలలో అభిమానులందరితో అందమైన సెల్ఫీ

సాక్షి, తగరపువలస(విశాఖపట్టణం) : రెండు ఇంజినీరింగ్‌ కళాశాలలు బుధవారం ‘ఓ బేబీ.. ఓ బేబీ’ అన్న నినాదాలతో హోరెత్తిపోయాయి. ఇంజినీరింగ్‌ కళాశాలలో బేబీ.. ఏంటీ.. విద్యార్థినులు ఉండొచ్చుగానీ అంటారా?.. అంటే.. బేబీ అంటే చిన్నారి కాదండోయ్‌.. ఆమె ప్రముఖ హీరోయిన్‌ సమంత. ఆమె నటించిన ఓ బేబీ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా చిత్ర యూనిట్‌ సభ్యులతో కలిసి సమంత రఘు ఇంజినీరింగ్‌ కళాశాలను సందర్శించి సందడి చేశారు. విద్యార్థుల మధ్య సందడి చేసిన వేళ.. అక్కడ సంభ్రమం, సంతోషం కలగలిసిన వాతావరణం కెరటమై ఎగసింది. సామ్‌ను చూసిన సంతోషంతో విద్యార్థుల్లో ఉత్సాహం ఉప్పొంగిపోయింది. అందుకు తగ్గట్టే స్పందించిన సమంత యువత అభిమానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. అంతా కేరింతలు కొడుతూ ఉంటే.. విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. పలువురు అమ్మాయిలు.. ఆమెను చూసిన ఆనందంలో ఉద్విగ్నతకు లోనై కన్నీళ్ల పర్యమంతమవుతూ సమంతను ఆలింగనం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ తన తొలి చిత్రం సక్సెస్‌ మీట్‌ విశాఖలోనే జరిగిందన్నారు. విశాఖ అంటే తనకు ప్రాణమన్నారు. ఎప్పుడో ఎంతో మంచి చేసి ఉంటానని అందుకే విద్యార్ధులు తనపై ఇంతటి ప్రేమను చూపిస్తున్నారని చెప్పారు. ఈ నెల 5న విడుదల అయ్యే ఓ బేబీ సినిమా తన కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలుస్తుందన్నారు. ప్రతి విద్యార్థి అమ్మతో కలిసి చూడదగ్గ చిత్రమని చెప్పారు. ఇంజినీరింగ్‌ చాలా కష్టమని తన స్నేహితులు చెబుతుంటారని, అందుకే కెరీర్‌ పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. సమంతతో పాటు దర్శకురాలు నందినిరెడ్డి, నటులు స్నిగ్ధ, తేజులకు రఘు విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ కామేశ్వరరావు, అధ్యాపకులు స్వాగతం పలికారు.

బుల్లయ్యలో ఉల్లాసం
అలాగే నగరంలోని లంకపల్లి బుల్లయ్య కళాశాలలో  సందడి చేశారు. బుధవారం సాయంత్రం కళాశాలకు వచ్చి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులతో సెల్ఫీలు తీసుకున్నారు. సమంతను చూడడానికి విద్యార్థులంతా ఎగబడ్డారు. సెల్ఫీలు, కరచాలనం  కోసం పోటీ పడ్డారు. ‘ఓ బేబీ’ విశేషాలను సమంత వివరించారు.


బుల్లయ్య కళాశాలలో విద్యార్థులతో సెల్ఫీ దిగుతున్న సమంత  

మరిన్ని వార్తలు