సందడి చేసిన ‘సంపూ'

4 Jul, 2014 00:41 IST|Sakshi
సందడి చేసిన ‘సంపూ'

హృదయ కాలేయం’ హీరో సంపూర్ణేష్‌బాబు (సంపూ) గురువారం దొమ్మేరులో సందడి చేశారు. అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న బందిపోటు సినిమా షూటింగ్ మూడోరోజు కొనసాగింది. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికలకు సంబందించి సన్నివేశాలను అల్లరి నరేష్, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు జూనియర్ ఆర్టిస్ట్‌లపై దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ చిత్రీకరించారు.

గ్రామ చావిడి వద్ద సంపూర్ణేష్ బాబుపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సహాయ నటుడు చాగల్లు సూరిబాబుతో పాటు పలువురు స్థానిక కళాకారులు నటించారు. శుక్రవారం నుంచి కొవ్వూరులో షూటింగ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాత ఆర్యన్ రాజేష్  తెలిపారు.
 - దొమ్మేరు (కొవ్వూరు రూరల్)
 
నాతో నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదు


సంపూర్ణేష్‌బాబు
దొమ్మేరు (కొవ్వూరు రూరల్): హృదయకాలేయం సినిమాలో తన పక్కన నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదని సినీహీరో సంపూర్ణేష్‌బాబు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ చిత్రంలో నటించేందుకు ముందుకురాలేదన్నారు. ఈవీవీ బ్యానర్‌లో పూర్తిస్థాయి నటుడిగా అవకాశం రావడం ఆనందంగా ఉందని సంపూ చెప్పారు. బందిపోటు చిత్రంలో నటించేందుకు కొవ్వూరు మండలం దొమ్మేరు వచ్చిన ఆయనతో ఇంటర్వ్యూ.

 మీ స్వగ్రామం ఏది
 మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం మెట్టపల్లి. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాను.

 అల్లరి నరేష్‌తో నటించడం ఎలా ఉంది.
 అల్లరి నరేష్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం.  
 
 హృదయకాలేయం సినిమాకు మీరే నిర్మాత అని టాక్..
 నిజానికి నేనే నిర్మాతగా తీద్దామనుకున్నా. అయితే స్టీవెన్ శంకర్ అనే మిత్రుడు నిర్మాతగా చిత్రాన్ని నిర్మించాం.

  హృదయకాలేయం నిర్మాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా
ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సినిమా ప్రారంభించడానికి ముందు మూడు నెలల వరకు నాతో నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నా సినిమాలో నటించడానికి ముందుకు రాలేదు. ఎవరూ రాకపోతే మగవారికి ఆడవారి వేషాలు వేసి సినిమా పూర్తిచేద్దామని నిర్ణయించాం. అయితే మా అదృష్టం వల్ల కావ్యకుమారి, ఈషికా సింగ్‌లు హీరోయిన్లుగా నటించేందుకు అంగీకరించారు. ధైర్యంతో కొత్త ప్రయోగం చేశాం. జనం ఆదరించారు.
 
అమెరికా నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి సినీపరిశ్రమకు వచ్చారట
 లేదండీ. నాకు మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం. సినీపరిశ్రమలోనే కొనసాగుతున్నాను. తొలిసారిగా మహాత్మా చిత్రంలో డెరైక్టర్ కృష్ణవంశీ చిన్నపాత్ర ద్వారా నటించడానికి అవకాశం ఇచ్చారు.
 
మీ తదుపరి చిత్రం
కొబ్బరిమట్ట సినిమాలో హీరోగా నటిస్తున్నా. స్టీవెన్ శంకర్ నిర్మాత. ఆగష్టు 25న ప్రారంభంకానుంది. త్రిపాత్రాభినయం చేస్తున్నా. ఏడుగురు హీరోయిన్‌లు నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు