చంద్రబాబు టార్గెట్‌ చేస్తున్నారు : సంచయిత

16 Jul, 2020 15:10 IST|Sakshi

సాక్షి, విజయనగరం : మాన్సాస్‌ ట్రస్ట్‌‌, సింహాచలం దేవస్ధానం చైర్‌ పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబును నాయుడు తనను టార్గెట్‌ చేస్తున్నారని సంచయిత గజపతిరాజు అన్నారు. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తరచూ ఎందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మన్సాస్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. మాన్సాస్‌లో ఎటువంటి అక్రమాలు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తన తండ్రి మరణించి (2016) నాలుగు రోజులు కూడా గడవక‌ముందే చంద్రబాబు ప్రత్యేక జీఓ ఇచ్చి బాబాయ్‌ అశోక గజపతిరాజును  చైర్మన్‌గా నియమించడం దారుణం కాదా అని నిలదీశారు. (మా కుటుంబం జోలికి రావొద్దు: సంచయిత)

సంచయిత ఇప్పుడు ఎందుకు వ్యతిరేకమైంది
టీడీపీ నేతల విమర్శల నేపథ్యంలో సంచయిత గురువారం ‘సాక్షి’ మీడియాతో మాట్లాడారు. ‘తమ కుంటుంబంపై చంద్రబాబు నాయుడతో సహా, అశోక గజపతిరాజు రాజకీయ కుట్రకు దిగుతున్నారు. మాపై వారికి ఏ మాత్రం అభిమానం ఉన్నా మా నాన్న చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ సంప్రదించి చైర్మన్‌ పదవిపై నిర్ణయం తీసుకునేవారు. నా తండ్రి వయస్సున్న వారు నాపై తప్పుడు ప్రచారం చేయడం బాధగా ఉంది. సన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంది. గతంలో టీడీపీ నేతలకి నచ్చిన సంచయిత ఇప్పుడు ఎందుకు వ్యతిరేకమైంది. పురాతన మోతీ మహల్‌ని పడగొట్టడానికి రాత్రికి రాత్రే టీడీపీ హయాంలో జిఓ ఇవ్వలేదా?. విజయనగరంలో మూడు లాంతర్లు అభివృద్ది చేసే సమయంలో మాత్రం తప్పుడు ప్రచారం చేయడం సమంజసమా.

దేవస్ధానంలో రాజకీయాలు తీసుకురాకండి
మహిళగా నాకు అవకాశం రావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. మహిళకి అవకాశం రాకూడదని వారు‌ కోరుకుంటున్నారు. ఎన్డీఆర్ హయాంలోనే పురుషులతో పాటు మహిళలకి సమాన అవకాశాలు కల్పించారు. ఆ విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారేమో. ఎన్టీఆర్‌ వెన్నుపోటుపొడిచి వచ్చిన వారు ఆయన ఆశయాలు ఎలా కొనసాగిస్తారు. చంద్రబాబు, అశోక్ గజపతిరాజులు ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. మాన్సాస్‌ వ్యవహారాన్ని ట్రావెన్ కోర్‌తో ఎలా ముడిపెడతారు. మాన్సాస్, సింహాచలం దేవస్ధానంలో రాజకీయాలు తీసుకురాకండి. చైర్ పర్సన్‌గా ప్రజలకోసం పనిచేస్తాను. శుక్రవారం నా తండ్రి దివంగత ఆనంద గజపతిరాజు 70 వ పుట్టినరోజు...అది కూడా వారికి గుర్తుండకపోవచ్చు.’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు