చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత

23 May, 2020 17:34 IST|Sakshi

సాక్షి, అమరావతి : విజయనగరం నగర అభివృద్ధి పనుల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్లను అధికారులు తొలగించడంపై ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేయడాన్ని సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు తప్పుబట్టారు. దీనిపై ఆమె ట్విటర్‌ వేదికగా వివరణ ఇచ్చారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, కేంద్రమాజీ మంత్రి అశోక గజపతిరాజు తీరుపై మండిపడ్డారు. ‘విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబు నాయుడు, మా బాబాయ్‌ అశోక్‌గజతి గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజం ఏంటంటే.. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి ప్రతిష్టిస్తారు. విజయనగరం చరిత్ర, సంస్కృతికి ప్రతీక, 1869 నాటి మోతీమహల్‌ను పునరుద్ధరించకుండా, మాన్సాస్‌ ఛైర్మన్‌గా ఉండగా బాబాయ్‌ అశోక్‌గజపతిగారు ఎందుకు ధ్వంసంచేశారు. తాతగారైన పీవీజీ రాజుగారి వారసత్వాన్ని ఎందుకు కాపాడలేకపోయారు?. దీనిపై చంద్రబాబు వివరణ ఇవ్వగలరా? ’ అని ట్వీట్‌ చేశారు. (మాన్సాస్‌లో పెనుమార్పు..!)

కాగా శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్లను గురువారం అధికారుల తొలగించిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో ఆధునిక హంగులతో కొత్త కట్టడాన్ని చేపట్టనున్నారు. మూడు లాంతర్లతో పాటు ఆశోకచక్రంతో కూడిన జాతీయ  చిహ్నం, మూడు సింహాలను కార్పొరేషన్‌ కార్యాలయంలో భద్రపరిచారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశాల మేరకు నగర అభివృద్ధి పనుల్లో భాగంగా వాటిని తొలగించామని, మూడు లాంతర్ల స్థానంలో నూతన నిర్మాణం చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ తెలిపారు. ఇప్పటి వరకూ ఉన్న నాలుగు సింహాల బొమ్మతో పాటు నూతన లాంతర్లను ఏర్పాటు చేసే దిశగా పలు నమూనాలను సిద్ధం చేశామన్నారు. రానున్న 15 రోజుల్లో కొత్త కట్టడం పూర్తిచేస్తామని తెలిపారు. దీనిపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. (బాబాయ్‌ ఇలా మాట్లాడతారా?)


 

మరిన్ని వార్తలు