కళ్లలో ఇసుక

30 Jul, 2015 02:15 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  జిల్లా నుంచి ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. దొంగ వే బిల్లులతో అక్రమ రవాణా ఊపందుకుంది. ప్రధానంగా పంచలింగాలతో పాటు పూడూరు ఇసుక రీచ్ నుంచి ఒక కంపెనీ ఈ ఇసుకను తరలిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా అధిక లోడుతో ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించి లారీలను పట్టుకున్నారు.
 
 ఈ మేరకు మొత్తం 8 లారీల ఇసుకను బుధవారం సీజ్ చేశారు. ఇందులో ఒక లారీ(టీఎస్ 06 యుఏ1449) నుంచి దొంగ వే బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడు లారీల్లో(12, 10 టైర్ల) లోడుకు మించి అదనంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు.
 
 ఈ విధంగా దొంగ బిల్లులు, అదనపు లోడు కలిపి ఏకంగా 158 టన్నుల ఇసుకను అక్రమంగా తరలించినట్టు స్పష్టమైం ది. మొత్తం ఇసుకకు ఎలాంటి రాయల్టీ చెల్లించలేదని తేల్చారు. ఇది కేవలం తనిఖీల్లో పట్టుబడిందేనని.. వాస్తవంగా రోజుకు ఈ విధంగా 50 నుంచి 60 లారీల ఇసుక వే బిల్లులు లేకుండా తరలిపోతోందని సమాచారం. ఒక్కో లారీ ఇసుక హైదరాబాద్‌లో లక్షన్నర వరకు పలుకుతోంది. ఈ లెక్కన జిల్లా నుంచి రోజుకు సుమారు కోటి రూపాయల విలువైన ఇసుక తరలిపోతుంది. మొత్తం వ్యవహారాన్ని రెవె న్యూ యంత్రాంగం కానీ.. చెక్‌పోస్టుల సిబ్బంది కానీ పట్టించుకోకపోవడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు