ములకలపల్లి(ముదినేపల్లి రూరల్), న్యూస్లైన్ : పాతకక్షల నేపథ్యంలోమండలంలోని ములకలపల్లిలో సర్పంచి కుటుంబంపై దాడి జరిగింది. సర్పంచి ప్రత్తిపాటి రాజేష్ పోలీసులకిచ్చిన ఫిర్యాదు ప్రకారం... గత జులైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందిన నాటి నుంచి తనపై టీడీపీ నేతలు కక్షగట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
గురువారం రాత్రి కే మధుబాబు, మిఖాయేలు, జే రాజేష్, అశోక్, వినోద్, ఆశ్వీరరావు తన పైన, తనతల్లి మీరమ్మపై దాడి చేశారని సర్పంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడ్డ సర్పంచి, మీరమ్మ గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా సర్పంచి వర్గీయులే తమపై దాడి చేశారంటూ ప్రత్యర్థి వర్గీయులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఎస్ఐ బీ వెంకటేశ్వరరావు ఇరువర్గాల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
నాయకుల పరామర్శ
గాయపడ్డ సర్పంచి రాజేష్, ఆయనతల్లి మీరమ్మను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, మండల కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు, సేవాదళ్ మండల కన్వీనర్ తాళ్ళూరి వెంకటేశ్వరరావు పరామర్శించారు. దాడికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.