రాజుకు ఏడేళ్ల జైలు

10 Apr, 2015 00:55 IST|Sakshi

రాజు సోదరులకు చెరో రూ. 5 కోట్లకు పైగా జరిమానా
ప్రత్యేక కోర్టు జడ్జి చక్రవర్తి తీర్పు
ఇది లోతైన కుట్రతో కూడిన తీవ్రమైన ఆర్థిక నేరం
కార్పొరేట్ ఖ్యాతితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీశారు
వీరి కుట్రతో మదుపుదారులు తీవ్రంగా నష్టపోయారు
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించిన జడ్జి
ఇలాంటి వారికి తీవ్రమైన శిక్షలు వేయాల్సిందేనని వ్యాఖ్య
చర్లపల్లి జైలుకు రాజు సహా నిందితుల తరలింపు


ఈ కుట్రతో మదుపుదారులు తీవ్రంగా నష్టపోయారు. దీన్ని అంతే తీవ్రంగా పరిశీలించాలి. దేశ కార్పొరేట్ వ్యవస్థ ఖ్యాతిని, మొత్తంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఘోర నేరంగా పరిగణించాలి. న్యాయం చేయడమంటే నేరానికి తగ్గ శిక్ష వేయడమే. శిక్ష విధించేటప్పుడు కోర్టులు చూడాల్సింది నేరగాళ్లకున్న హక్కుల్ని మాత్రమే కాదు. బాధితుల హక్కుల్ని, సమాజం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.    
 - తీర్పు సందర్భంగా జడ్జి

 
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందికి ప్రత్యేక కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి గురువారం 971 పేజీల తీర్పు వెలువరించారు. రామలింగరాజుకు రూ. 5.74 కోట్లు, రామరాజుకు రూ. 5 కోట్ల 73 లక్షల 75 వేలు జరిమానా విధించారు.

మిగతా నిందితులందరికీ కలిపి రూ. 13.84 కోట్లు జరిమానాగా విధించారు. వివిధ నేరాలకు వేర్వేరుగా శిక్షలు విధించినా వాటిని ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. దీని ప్రకారం దోషులంతా గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా చెల్లించకపోతే మరికొన్ని నెలలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే విచారణ ఖైదీలుగా జైలులో ఉన్న కాలాన్ని మినహాయించి (సీఆర్పీసీ సెక్షన్ 428 కింద) మిగతా శిక్షా కాలాన్ని మాత్రమే దోషులు అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు ప్రతులను దోషులకు అందజేశారు. దీనిపై పైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని, అవసరమైతే లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయసహాయం పొందవచ్చని వారికి సూచించారు. విచారణలో సహకరించిన సీబీఐ స్పెషల్ పీపీ, నిందితుల తరఫు న్యాయవాదులు, ఇతర కోర్టు సిబ్బందికి న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.
 
తీవ్రమైన ఆర్థిక నేరం
 
నిందితులపై నేరం రుజువైనట్లుగా తొలుత న్యాయమూర్తి ప్రకటించారు. ఈ నేరాల్లో గరిష్టంగా 14 ఏళ్ల జైలు శిక్షతోపాటు అపరిమితమైన జరిమానా విధించవచ్చని స్పష్టం చేశారు. శిక్ష కాలపరిమితి విధింపుపై దోషుల అభిప్రాయాలను అడిగారు. ‘‘శిక్షకాలంపై దోషుల అభిప్రాయాలను విన్నాక.. కేసులోని వాస్తవాలు, పరిస్థితులు, నేరం తీవ్రత చూశాక ఇది చాలా లోతైన కుట్రతో కూడిన ఆర్థిక నేరమని నేను భావిస్తున్నా. ఈ కుట్రవల్ల మదుపుదారులు దారుణంగా నష్టపోయారు. దీన్ని అంతే తీవ్రంగా పరిశీలించాలి. దేశ కార్పొరేట్ వ్యవస్థ ఖ్యాతిని, మొత్తంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఘోర నేరంగా పరిగణించాలి. ప్రొబేషనర్స్ ఆఫ్ అఫెండర్స్ యాక్టును పరిగణలోకి తీసుకొని శిక్షా కాలంపై ఉదాసీనత చూపించాల్సిన నేరం కాదిది. ధనుంజయ్ ఛటర్జీ అలియాస్ ధన వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లుగా... నేరగాళ్లపై తీర్పులు వెలువరించేటప్పుడు సమాజం వేదనను అర్థం చేసుకొని దానికి తగ్గ శిక్ష వేయడమే కోర్టుల ప్రతిస్పందనగా భావించాలి. న్యాయం చేయడమంటే నేరానికి తగ్గ శిక్ష వేయడమే. శిక్ష విధించేటప్పుడు కోర్టులు చూడాల్సింది నేరగాళ్లకున్న హక్కుల్ని మాత్రమే కాదు. బాధితుల హక్కుల్ని, సమాజం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి’’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. తీర్పు వింటూనే రామలింగరాజు తదితర నిందితుల బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం రాజు సహా నిందితులందరినీ గురువారం సాయంత్రం 7 గంటలప్పుడు చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. రామలింగరాజుకు 4148, రామరాజుకు 4147 నంబర్లు కేటాయించినట్టు జైలు అధికారులు తెలిపారు. ‘‘వారిద్దరినీ మానస బ్యారక్‌కు తరలించాం. మిగతావారిని అడ్మిషన్ బ్యారక్‌లో ఉంచాం. శుక్రవారం ఉదయం మరో బ్యారక్‌లోకి మారుస్తాం’’ అని తెలిపారు.
 
బాక్సులుసెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకోవాలి

ప్రత్యేక కోర్టు తీర్పును నిందితులు నాంపల్లి క్రిమినల్ కోర్టుల ఆవరణలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో నిందితులు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టు విధించిన జరిమానాను చెల్లించాకే అప్పీలుకు అవకాశముంటుంది. అప్పీల్‌లో నేరం రుజువయ్యేదాకా శిక్ష అమలును నిలిపివేయాలని కోర్టును కోరవచ్చు. అందుకు కోర్టు అనుమతిస్తే, వారిని జైలు నుంచి బెయిలుపై విడుదల చేయాలని ఆదేశించవచ్చు.
 
అతి పెద్ద ఆర్థిక నేరమిది: సీబీఐ స్పెషల్ పీపీ

‘‘దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరమిది. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు తప్పుడు ఖాతాలు సృష్టించారు. ఖాతాలు తారుమారు చేసి మదుపుదారులను మోసం చేశారు. దోషులందరికీ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది’’అని స్పెషల్ పీపీ సురేంద్ర తెలిపారు. ‘నేర తీవ్రతతో పాటు కార్పొరేట్ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసిన తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించి దోషులకు శిక్ష ఖరారు చేయండి’’ అని అంతకు ముందు న్యాయమూర్తికి ఆయన నివేదించారు. తీర్పు సందర్భంగా సీబీఐ డీఐజీ చంద్రశేఖర్, డీఎస్పీ శంకర్‌రావు కోర్టుకు హాజరయ్యారు.
 
రిమాండ్‌తో సరిపెట్టండి: నిందితుల లాయర్లు

‘రామలింగరాజు 33 నెలలు, రామరాజు 30 నెలలు, మిగతా నిందితులు కొన్ని నెలల పాటు జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసు ద్వారా వ్యక్తిగతంగా నిందితులకు తప్ప ఎవరికీ నష్టం జరగలేదు. ప్రస్తుతం సత్యం కంపెనీ షేరు విలువ కూడా గణనీయంగా పెరిగింది. కేసు విచారణ కాలంలో తీవ్రమైన క్షోభను అనుభవించారు గనుక విచారణ ఖైదీగా ఉన్న కాలంతో సరిపెట్టి వారిని విడిచిపెట్టండి’’ అని నిందితుల లాయర్లు ఉమామహేశ్వర్‌రావు, రవీందర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు.
ప్రత్యేక హోదాకు జడ్జి నో

తనకు జైలులో ప్రత్యేక ఖైదీ హోదా కల్పించాలన్న రామలింగరాజు అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఇంత తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి ప్రత్యేక హోదా కింద సౌకర్యాలు కల్పించాలని ఆదేశించలేనని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.
 
ఆ డాక్యుమెంట్లు తిరిగిచ్చేయండి

కేసు దర్యాప్తులో భాగంగా బైర్రాజు ఫౌండేషన్, సత్యం కంప్యూటర్స్‌సంస్థల నుంచి సీబీఐ అనేక డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని సీజ్ చేసింది. కేసుతో సంబంధం లేనివాటిని అప్పీల్ గడువు ముగిసిన తర్వాత సంబంధిత అధికారులకు తిరిగి అప్పగించాలని న్యాయమూర్తి సీబీఐని ఆదేశించారు.
 
 అతి పెద్ద ఆర్థిక నేరమిది

 సీబీఐ స్పెషల్ పీపీ
 ‘‘దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరమిది. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు తప్పుడు ఖాతాలు సృష్టించారు. ఖాతాలు తారుమారు చేసి మదుపుదారులను మోసం చేశారు. దోషులందరికీ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది’’అని స్పెషల్ పీపీ సురేంద్ర తెలిపారు. ‘నేర తీవ్రతతో పాటు కార్పొరేట్ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసిన తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించి దోషులకు శిక్ష ఖరారు చేయండి’’ అని అంతకు ముందు న్యాయమూర్తికి ఆయన నివేదించారు. తీర్పు సందర్భంగా సీబీఐ డీఐజీ చంద్రశేఖర్, డీఎస్పీ శంకర్‌రావు కోర్టుకు హాజరయ్యారు.
 
వడ్లమాని శ్రీనివాస్ (మాజీ సీఎఫ్‌వో)

ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.33.75 లక్షల జరిమానా.
జరిమానా చెల్లించకపోతే మరో 25 నెలల జైలు శిక్ష.
 
సుబ్రమణ్యం గోపాలకృష్ణన్ (ఆడిటర్)

ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.33.75 లక్షల జరిమానా.
జరిమానా చెల్లించకపోతే మరో 24 నెలల జైలు శిక్ష.
 
తాళ్లూరి శ్రీనివాస్
ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.30.25 లక్షల జరిమానా.
జరిమానా చెల్లించకపోతే మరో 24 నెలల జైలు శిక్ష.
 
బి.సూర్యనారాయణ రాజు
ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.26 లక్షల జరిమానా.
జరిమానా చెల్లించకపోతే మరో 9 నెలల జైలు శిక్ష.
 
జి.రామకృష్ణ
ఏడేళ్ల జైలు శిక్షతోపాటు 34.50 లక్షల జరిమానా. .
జరిమానా చెల్లించకపోతే మరో 28 నెలల జైలు శిక్ష.
 
జి.వెంకటపతిరాజు
ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.27.75 లక్షల జరిమానా.
జరిమానా చెల్లించకపోతే మరో 16 నెలల జైలు శిక్ష.
 
సీహెచ్ శ్రీశైలం
ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.27.75 లక్షల జరిమానా.
జరిమానా చెల్లించకపోతే మరో 16 నెలల జైలు శిక్ష.
 
వీఎస్ ప్రభాకర్ గుప్తా
ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.26 లక్షల జరిమానా.
జరిమానా చెల్లించకపోతే మరో 9 నెలల జైలు శిక్ష.
 
తీర్పు మొత్తం పేజీలు -971
జరిమానా.. (కోట్లలో) రామలింగరాజు -5.74
రామరాజు - 5.74
మిగతా అందరికీ కలిపి -13.84


మరిన్ని వార్తలు