విశాఖపట్నం : ఎన్టీపీసీ కాలుష్యం నుంచి పిట్టపాలెం, దాని చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు గ్రామాలను కాపాడాలని పెదగంట్యాడ మండలం పిట్టపాలెం గ్రామస్తులు పాదయాత్రలో జగన్ను కోరారు. ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఎన్టీపీసీ నుంచి వెలువడుతున్న బొగ్గు వ్యర్థాలు, ప్లైయాష్ వల్ల పిట్టపాలెం, దేవాడ, అసరపునగర్, దాసరిపేట, మరద పేట తదితర గ్రామాలవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.ప్లైయాష్ గ్రామంలో పడటం వల్ల గ్రామస్తులు అనారోగ్యం బారినపడుతున్నారన్నారు.
పిట్టపాలెంకు సమీపంలోనే ఎన్టీపీసి వారు ప్లైయాస్ యార్డు నిర్మించారన్నారు. ప్లైయాష్ను బొగ్గును కాల్చగా వచ్చే వ్యర్థాలు ఇక్కడ నిల్వ ఉంచడం వల్ల ఇవి భూమిలో ఇంకి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. మాగ్రామాన్ని తరలించి మమ్మల్ని కాలుష్యంనుంచి కాపాడాలన్నారు. చాలా ఏళ్లనుంచి ఈ సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యను మీరే పరిష్కరించాలని బాలరాజు, పి.కొండబాబు, పి.నాగరాజు తదితరులు కోరారు. మా గ్రామాన్ని తరలించకుండా స్థానిక నాయకులు కొంతమంది అడ్డుకుంటున్నారన్నారు.