కొండపై నీటి పొదుపు

24 Aug, 2015 02:02 IST|Sakshi

ముందస్తు జాగ్రత్తల్లో టీటీడీ       
మఠాలు,హోటళ్లకు సరఫరాలో కోత
కాటేజీల్లోనూ కొళాయిల బంద్   

పుష్కరిణికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు
 
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో  తాగునీటి జలాశయాలు ఎండి పోవడంతో టీటీడీ నీటి పొదుపు చర్యలు ముమ్మరం చేసింది. ఆలయం, నిత్యాన్న ప్రసాద కేంద్రం మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో నీటి సరఫరాలో భారీగా కోత విధించింది. వార్షిక, నవ రాత్రి బ్రహ్మోత్సవా లకు నీటి ఎద్దడి లేకుండా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది.
 
తిరుమల:తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే సుమారు 70 వేల మంది భక్తులతో పాటు ఆలయ అవసరాల కోసం రోజూ 32 లక్షల గ్యాలన్ల నీరు అవసరం. ఏటా కురవాల్సిన 1,369.4 మిల్లీ మీటర్ల వర్షపాతంలో కనీసం 800 మి.మీ కూడా పడలేదు. తాగునీటిని  సరఫరా చేసే గోగర్భం(2,840 లక్షల గ్యాలన్లు), ఆకాశ గంగ(670 లక్షల గ్యాలన్లు), కుమారధార(3224.83 లక్షల గ్యాలన్లు), పసుపుధార(886.70 లక్షల గ్యాలన్ల) ఎండిపోయాయి. ఒక్క పాపవినాశనం(5240 లక్షల గ్యాలన్లు)లో  20 శాతం మాత్రమే నీటి నిల్వ ఉంది.

 గంగ, బోర్ల నీటితో నెట్టుకొస్తున్న టీటీడీ
 తిరుమల అవసరాల కోసం రోజూ 5 నుంచి 7 ఎంఎల్‌డీ తెలుగుగంగ నీటిని సరఫరా చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం రోజూ 10 ఎంఎల్‌డీ (22.5 లక్షల గ్యాలన్లు) తెలుగుగంగ నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా ప్రస్తుతం అందులో సగం మాత్ర మే అందుతోంది. దీంతోపాటు కల్యాణీ డ్యాంలో వేసిన బోర్ల ద్వారా మరికొంత నీటిని సేకరిస్తున్నా రు. వీటితో భక్తులు, ఆలయం, అన్నదానం కోసం సరఫరా చేస్తున్నారు. నిత్యం వాడే నీటిలో సుమారు 40 శాతం కోత విధించారు. నీటిని చాలా పొదుపుగా వాడుతున్నారు.

 మఠాలు, హోటళ్లకు భారీగా కోత
 తిరుమలలోని 30 మఠాలు, 20 దాకా పెద్ద హోటళ్లు, మరో 50 హోటళ్లకు సరఫరా చేసే నీటిని బట్టి టీటీడీ అద్దె వసూలు చేస్తోంది.  తాజా పరిస్థితులతో భారీగా నీ టి కోత విధించారు. దీంతో ప్రత్యామ్నాయంగా తిరుప తి నుంచి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక  స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్‌లో కూడా పది రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు.  కాటేజీల్లో ని నీటి కొళాయిల(నల్లాలు) సరఫరాలోనూ కోత విధిం చారు. ఆరుబయట కొన్ని  తాగునీటి కొళాయిల్ని మూసివేశారు. కాటేజీల్లో మరుగుదొడ్డి, స్నానాల గది, వాష్‌బేసిన్‌లో మూడు కొళాయిలు ఉంటాయి.  రెండు కొళాయి లు మూసివేసి కేవలం ఓ కొళాయి ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆరుబయట రోడ్లకు ఇరువైపులా ఉం డే మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కొన్ని మూసివేశారు. మరికొన్నింటిలో నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

 ట్యాంకర్లతోనే శ్రీవారి పుష్కరిణికి మంచినీరు
 సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు వార్షిక, అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం పుష్కరిణికి మరమ్మతులు పూర్తి చేశారు. తిరుమలలోని మంచి నీటి డ్యామ్‌లు ఎండిపోవడంతో తిరుపతి నుంచి ట్యాంకర్లతో నీటిని పుష్కరిణికి సరఫరా చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు నీటి ఇబ్బందులు లేకుండా పొదుపు చర్యల్ని టీటీడీ పెంచింది.
 

మరిన్ని వార్తలు