మహిళల మెడపై కత్తి

13 Jul, 2014 02:46 IST|Sakshi
మహిళల మెడపై కత్తి

- టీడీపీ మాఫీ హామీతో 3 నెలలుగా ఆగిపోయిన చెల్లింపులు
- వడ్డీతో అప్పు తీర్చాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి
- వచ్చే వారం నుంచి నోటీసులు జారీకి సమాయత్తం

విశాఖ రూరల్: చంద్రబాబు తప్పుడు హామీతో మహిళల పొదుపు ఉద్యమానికి ఆటంకం ఏర్పడింది. డ్వాక్రా రుణ మాఫీ ప్రకటన.. మహిళలను బ్యాంకులకు రుణగ్రస్తులను చేసింది. నిన్నమొన్నటి వరకు ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయాన్ని ఆర్జించి పొదుపు చేసుకున్న డబ్బు.. ఇప్పుడు హారతి కర్పూరంలా బ్యాంకు వడ్డీ కింద కరిగిపోనుంది. తీసుకున్న రుణాలు వడ్డీతో సహా వసూలుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నారు. కొంత మంది ఖాతాల్లోని పొదుపు మొత్తం నుంచి అసలు, వడ్డీని జమ చేసుకుంటుండగా.. మిగిలిన వారికి నోటీసులు జారీకి సమాయత్తమవుతున్నారు.
 
రూ.853 కోట్లు బకాయిలు
దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకంతో మహిళలు ఆర్థిక ఇ బ్బందులను అధిగమించా రు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం.. వృత్తి పనులు, వ్యాపారాలు చేస్తూ నెల నెలా పొదుపు చేసుకుంటూ.. ఆర్థిక ఆసరా పొందారు. ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అది నమ్మి మహిళా సంఘాలు బ్యాంకులకు రుణాలు చెల్లించడం మానేశాయి. జిల్లాలో మొత్తంగా డ్వాక్రా రుణ బకాయిలు రూ.853 కోట్లు ఉన్నాయి. విశాఖ నగరం పరిధిలో 18,500 మహిళా స్వయం సహాయ సంఘాలు రూ.260 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ పరిధిలో 37,634 మహిళా సంఘాలు రూ.593 కోట్లు బ్యాంకులకు బకాయి పడ్డాయి.
 
సిద్ధమవుతున్న నోటీసులు : డ్వాక్రా రుణాల మాఫీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రుణాలు రద్దవుతాయని భావించి మహిళలు మూడు నెలలుగా చెల్లింపులు ఆపేశారు. తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలంటూ మహిళలపై ఒత్తిడి పెంచేందుకు బ్యాం కర్లు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. వచ్చే వారం నుంచి జారీకి సమాయత్తమవుతున్నారు. అప్పులు కట్టకపోవడంతో బ్యాంకులు గ్రూపుల ఖాతాలో ఉండే పొదుపు డబ్బును తమ ఖాతాలోకి జమ చేసుకుంటున్నాయి. ఈ ఏడాది రుణ లక్ష్యం మందగించే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 వేల సంఘాలకు రూ.580 కోట్లు డ్వాక్రా రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకర్లు ఇప్పటి వరకు కేవలం కొన్ని సంఘాలకు రూ.22 కోట్లు మాత్రమే రుణాలు ఇచ్చారు. ఈ పరిస్థితితో  మహిళా సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు..
నాది అచ్యుతాపురం. చంద్రబాబు డ్వాక్రా రుణ మాఫీ హామీతో 8నెలలుగా వాయిదాలు కట్టడం మానేశాను. బ్యాంకు వారు వడ్డీకి వడ్డీతో అప్పును అసలుకు రెట్టింపు చేశారు. లీడర్లుకు చెప్పకుండా పొదుపుసొమ్మును ఒక్కో గ్రూపు నుంచి రూ. 50వేలు నుంచి రూ.లక్ష వరకు జమచేసుకున్నారు. ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి..ఇప్పుడు సీఎం మాటమారిస్తే ఊరుకునేదిలేదు.
 - ఎస్ శాంతి, అచ్యుతాపురం
 
ప్రభుత్వం చేతులెత్తేస్తే ఊరుకోం
 నాది అచ్యుతాపురం మండలం చోడపల్లి. డ్వాక్రా రుణం చెల్లించాలంటూ బ్యాంకు మేనేజర్‌లు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. డ్రాక్రా అప్పుఉన్న మ హిళ కుటుంబసభ్యుల పేరుమీద బ్యాంకుల్లో బం గారం తాకట్టు ఉంటే విడిపించుకోకుండా అడ్డుకుంటున్నారు. సభ్యురాలి రుణానికి కుటుంబసభ్యులకు సంబంధం ఏమిటో అర్థం కావడంలేదు. మాఫీ చేస్తామని ఓట్లు దండుకొని చేతులెత్తేస్తే ఊరుకోం.
 - అనసూరి లక్ష్మి, చోడపల్లి

మరిన్ని వార్తలు