-

ఎస్‌బీఐ క్యాషియర్‌ భార్య అరెస్ట్‌

9 May, 2018 11:57 IST|Sakshi

పోరుమామిళ్ల: పోరుమామిళ్ల స్టేట్‌ బ్యాంక్‌ క్యాషి యర్‌ మార్తాల గురుమోహన్‌రెడ్డి భార్య చిన్నపురెడ్డి మంజులతను మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ పెద్ద ఓబన్న తెలిపారు. గురుమోహన్‌రెడ్డి నేరానికి తాను సహకరించినట్లు మంజులత ఒప్పుకుందని ఎస్‌ఐ తెలిపారు. గురుమోహన్‌రెడ్డి డబ్బంతా షేర్లలో పెట్టినట్లు తెలుస్తోందని, అతను పరారీలో ఉన్నాడని వివరించారు. మంజులత బ్యాంక్‌ అకౌంట్‌ పరిశీలించగా రూ.కోటి 90 లక్షలు  గురుమోహన్‌రెడ్డి అకౌంట్‌కు బదిలీ అయినట్లు ఉందన్నారు. 

ఇప్పుడు ఆమె అకౌంట్లో, గురుమోహన్‌రెడ్డి అకౌంట్లో డబ్బు లేదని ఎస్‌ఐ వివరించారు. గురుమోహన్‌రెడ్డి ప్రొద్దుటూరు బజాజ్‌ ఫైనాన్స్, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ సంస్థల్లో పెట్టిన 720 గ్రాముల బంగారు రికవరీ చేశామన్నారు. మిగతా బంగారు ఎక్కడుందో విచారిస్తున్నామన్నారు. మంజులత దగ్గర నుంచి నకిలీ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గురుమోహన్‌రెడ్డి షేర్లలో పెట్టిన డబ్బు పోగొట్టుకున్నట్లు తెలుస్తోందని ఎస్‌ఐ తెలిపారు. వాస్తవంగా గురుమోహన్‌రెడ్డి ఎంత డబ్బు.. బంగారు.. దోచుకెళ్లాడనే అంశంపై వివరాల్లేవు. బ్యాంకు అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. 

మరిన్ని వార్తలు