సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు సర్కారు దళిత చట్టాలను అపహాస్యం చేస్తోందని, దళితుల నోటికాడి కూడును చంద్రబాబు బొక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ రుణాలను టీడీపీ నేతలకు ధారాదత్తం చేస్తోందని, ఎస్సీ కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారిందన్నారు. జూపూడి ప్రభాకర్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది దోచుకోవటానికి కాదని హితవు పలికారు.
దళితుల సొమ్ము దోచుకోవడానికి సిగ్గు లేదా అంటూ జూపూడి ప్రభాకర్ని ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆదినారాయణ రెడ్డి దళితులతో పెట్టుకోవటం మంచిది కాదని హెచ్చరించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 100కోట్ల రూపాయల మేర ఎస్సీ కార్పొరేషన్ నిధులు గల్లంతయ్యాయని తెలిపారు. నిధుల గల్లంతుపై చంద్రబాబు వెంటనే సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. వైఎస్సార్సీపీ దళితుల తరపున ఉద్యమిస్తుందని ఆయన స్పష్టం చేశారు.