హమ్మయ్య.. సెలవిచ్చారు!

26 Jun, 2014 02:20 IST|Sakshi

శ్రీకాకుళం: ఎట్టకేలకు కలెక్టర్‌గారు స్పందించారు. విద్యార్థుల కష్టాలు గుర్తించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గురువారం జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశించారని డీఈవో అరుణకుమారి బుధవారం తెలిపారు. జిల్లాలో మళ్లీ ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు  వివరించారు. వాస్తవానికి పది రోజులుగా జిల్లాతోపాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల స్థాయిలో నమోదవుతున్నాయి. వీటికితోడు తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో పలు జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ శ్రీకాకుళంలో మాత్రం సెలవు ప్రకటించలేదు. ఐదారు రోజుల క్రితం బూర్జ మం డలం గుత్తావల్లి పాఠశాలలో ఐదుగురు విద్యార్థు లు వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయారు కూడా.
 
 అప్పటికి గానీ కలెక్టర్ స్పందించలేదు. అది కూడా ఆ మరుసటి రోజు విద్యార్థులందరూ స్కూళ్లకు వెళ్లిన తర్వాత మధ్యాహ్నం పూటే సెలవు ప్రకటించారు. దాంతో విద్యార్థులు ఎండలో ఉసూరుమంటూ తిరిగి ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది. కాగా ఇటీవల రెండు రోజులు వాతావరణం కాస్త చల్లబడినా మంగళవారం నుంచి మళ్లీ ఎండలు ముదిరాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోస్తా జిల్లాలైన విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో పాఠశాలలకు అక్కడి కలెక్టర్లు మంగళవారం నుంచే సెలవు ప్రకటించారు. ఇప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్పందించలేదు. బుధవారం పిల్లలు ఎండలోనే స్కూళ్లకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఆలస్యంగానే స్పందించి గురువారం జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటిం చారు. అయితే బుధవారం రాత్రి జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురిసి వాతావరణం చల్లబడటం కొసమెరుపు.
 

మరిన్ని వార్తలు